NTV Telugu Site icon

IndvsBan: టీమిండియా మహిళల జట్టుకు చేజారిన విజయం.. సిరీస్ సమం

Indvsban

Indvsban

బంగ్లాదేశ్‌ మహిళలతో జరిగిన చివరి వన్డేలో టీమిండియా ఉమెన్స్ జట్టు 226 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగింది. కానీ 41.1 ఓవర్లలో స్కోరు 191/4…చేతిలో 6 వికెట్లతో మరో 53 బంతుల్లో 35 పరుగులు చేయాల్సిన పరిస్థితిలో మ్యాచ్ మలుపు తిరిగింది. హర్లీన్‌ డియోల్‌, దీప్తి శర్మ ఒకే ఓవర్లో రనౌట్ కావడంతో పాటు.. 34 పరుగుల వ్యవధిలో చివరి 6 వికెట్లను కోల్పోయిన భారత్‌ స్కోరును మాత్రం సమం చేసింది. అయితే, చివర్లో 19 బంతుల్లో 10 పరుగులు చేయాల్సిన సమయంలో కూడా లక్ష్యాన్ని అందుకోలేక మూడు బంతులు మిగిలి ఉండగానే టీమిండియా ఆలౌటైంది. జెమీమా రోడ్రిగ్స్‌ మరో ఎండ్‌లో ఉండగా.. చివరి ఓవర్‌ మూడో బంతికి మేఘనా సింగ్‌ను మారుఫా అవుట్‌ చేయడంతో మ్యాచ్‌ టై అయింది.

Read Also: Honey Trap: తల్లికి బాలేదని డాక్టర్‎ను ఇంటికి పిలిచింది.. వీడియో తీసి బ్లాక్ మెయిల్ మొదలుపెట్టింది

భారత్‌ 49.3 ఓవర్లలో 225 పరుగులకు ఆలౌట్‌ కాగా… అంతకు ముందు బంగ్లాదేశ్‌ జట్టు 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. అప్పటికే నిర్ణీత సమయం దాటిపోవడంతో నిబంధనల ప్రకారం సూపర్‌ ఓవర్‌ కూడా నిర్వహించలేదు. తొలి రెండు వన్డేల్లో ఇరు జట్లు ఒక్కోటి గెలవడంతో సిరీస్‌ 1–1తో ‘డ్రా’గా ముగిసింది. టీమిండియా ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ స్మృతి మంధాన రాణించింది. స్మృతి, హర్లీన్‌ మూడో వికెట్‌కు 107 పరుగులు జోడించారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ నిరాశపర్చడంతో పాటు స్వల్ప విరామంలో ఓవర్‌కు రెండు చొప్పున నాలుగు వికెట్లు పడిపోవడంతో భారత్‌ విజయానికి దగ్గరగా వెళ్లి ఆగిపోయింది.

Read Also: Nellore: ప్రభుత్వాసుపత్రిలో ఆక్సీజన్ అందక 8 మంది రోగులు మృతి…కుటుంబ సభ్యుల ఆందోళన

అయితే, అంతకు ముందు ఫర్జానా హక్‌, షమీమా సుల్తానా బంగ్లా బ్యాటింగ్ లో కీలక పాత్ర పోషించారు. బంగ్లాదేశ్‌ తరఫున మహిళల వన్డేల్లో సెంచరీ సాధించిన తొలి బ్యాటర్‌గా ఫర్జానా రికార్డ్ సృష్టించింది. చివరి వన్డేలో అంపైరింగ్‌ ప్రమాణాలపై టీమిండియా సారథి హర్మన్‌ప్రీత్‌ కౌర్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇన్నింగ్స్‌ 34వ ఓవర్లో నాహిదా బౌలింగ్‌లో అవుటయ్యాక హర్మన్‌ తన బ్యాట్‌తో స్టంప్స్‌ను బలంగా కొట్టి అంపైర్‌తో గొడవకు దిగింది. ఈ మ్యాచ్‌తో మేం చాలా నేర్చుకున్నాం.. అంపైరింగ్‌ ప్రమాణాలను కూడా చూశాం.. చాలా ఘోరంగా ఉంది అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.