Team India Schedule: ఐపీఎల్ 2026 ఓవర్.. వాట్ నెక్స్ట్.? 2027 వరల్డ్ కప్ వరకు టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే.!

Team India Schedule

Team India Schedule

Team India Schedule: మే 31 నాటికి ఐపీఎల్ పండుగ ముగిసింది. ఆర్సీబి వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. ఇకపోతే అభిమానుల్లో ఐపీఎల్ 2026 ముగియడంతో భారత్ కు సంబంధించిన మ్యాచ్ లపై ఆసక్తి నెలకొంది. అయితే భారత్ టీ20 వరల్డ్ కప్ 2026 టైటిల్‌ను సొంతం చేసుకున్న తర్వాత ఇప్పుడు తదుపరి లక్ష్యాలపై దృష్టి సారించింది. ఐపీఎల్ 2026 సీజన్ ముగియడంతో ఆటగాళ్లు మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌కు సిద్ధమవుతున్నారు. రాబోయే 18 నెలలు టీమిండియాకు కీలకంగా మారనున్నాయి. ఒకవైపు 2027 వన్డే వరల్డ్ కప్, మరోవైపు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ లక్ష్యాలతో భారత జట్టు సుదీర్ఘ క్రికెట్ ప్రయాణాన్ని మొదలు పెట్టనుంది..

ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌తో కొత్త ప్రయాణం:
ఐపీఎల్ ముగిసిన వెంటనే భారత జట్టు తొలి సవాల్‌గా ఆఫ్ఘనిస్తాన్‌ను ఎదుర్కోనుంది. స్వదేశంలో జరగనున్న ఈ సిరీస్‌లో ఒక టెస్ట్, మూడు వన్డే మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. జూన్ 6 నుంచి జూన్ 20 వరకు జరిగే ఈ సిరీస్‌తో టీమిండియా కొత్త సీజన్‌ను ప్రారంభించనుంది. ఈ సిరీస్ తర్వాత భారత జట్టు వరుసగా ఇంగ్లాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి బలమైన జట్లతో తలపడనుంది. దీంతో జట్టు బలం, బెంచ్ స్ట్రెంగ్త్, యువ ఆటగాళ్ల ప్రతిభకు పరీక్షగా ఈ షెడ్యూల్ నిలవనుంది.

×
×
Ad

ఇంగ్లాండ్ పర్యటన:
జూలై నెలలో భారత్ ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఐదు టీ20లు, మూడు వన్డేలతో కూడిన ఈ సిరీస్ జూలై 1 నుంచి 19 వరకు జరుగుతుంది. విదేశీ గడ్డపై ఇంగ్లాండ్‌ను ఎదుర్కోవడం ఎప్పుడూ సవాల్‌గా ఉంటుంది.

శ్రీలంక, బంగ్లాదేశ్ సిరీస్‌లు:
ఆగస్టులో శ్రీలంక పర్యటనలో రెండు టెస్టులు, రెండు టీ20 మ్యాచ్‌లు ఆడనున్న భారత్.. సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఈ సిరీస్‌లు ప్రపంచ కప్ ప్రణాళికలకు కీలకంగా మారనున్నాయి. అదే నెలలో ఆఫ్ఘనిస్తాన్ గడ్డపై మరోసారి మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ కూడా టీమిండియాకు ఎదురుచూస్తోంది.

ఏషియన్ గేమ్స్‌లో భారత్:
సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్ వేదికగా జరిగే ఏషియన్ గేమ్స్‌లో క్రికెట్ టీ20 ఫార్మాట్‌లో నిర్వహించనున్నారు. ఈ టోర్నీలో భారత్ మరోసారి స్వర్ణ పతకంపై కన్నేసే అవకాశం ఉంది. యువ ఆటగాళ్లకు ఈ మెగా ఈవెంట్ మంచి వేదికగా నిలవనుంది.

న్యూజిలాండ్, వెస్టిండీస్ సవాల్:
అక్టోబర్‌లో వెస్టిండీస్ భారత్‌కు రానుండగా, ఆ తర్వాత భారత జట్టు న్యూజిలాండ్ పర్యటన కూడా అత్యంత కీలకంగా మారనుంది. రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. న్యూజిలాండ్ పరిస్థితుల్లో విజయం సాధించడం ఎప్పుడూ కష్టమే. అందువల్ల ఈ పర్యటనపై సెలెక్టర్లు, కోచ్‌ల దృష్టి ప్రత్యేకంగా ఉండనుంది.

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ:
2027 ఆరంభంలో భారత క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సిరీస్ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ. స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్ జనవరి-ఫిబ్రవరి నెలల్లో జరగనుంది. ఈ సిరీస్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ అవకాశాలను ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో భారత్‌కు అత్యంత కీలకంగా మారింది.

2027 ఏడాది భారత క్రికెట్‌కు అత్యంత ముఖ్యమైన సంవత్సరంగా నిలవనుంది. మొదట జూన్‌లో జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించడమే తొలి లక్ష్యం. అనంతరం జూలైలో బంగ్లాదేశ్ వేదికగా జరిగే ఆసియా కప్‌లో భారత్ టైటిల్‌ను కాపాడుకోవాలని చూస్తుంది. అయితే అన్ని కళ్లూ అక్టోబర్-నవంబర్‌లో జరగనున్న 2027 వన్డే వరల్డ్ కప్‌పైనే ఉన్నాయి. క్రికెట్ వరల్డ్ కప్ 2027 దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్త ఆతిథ్యంలో జరగనున్న ఈ మెగా టోర్నీ కోసం ఇప్పటి నుంచే టీమిండియా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.