Taneti Vanitha: పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులపై దాడిని ఖండిస్తూ ద్వారకాతిరుమలలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. ఈ నిరసన కార్యక్రమంలో హోంమంత్రి తానేటి వనిత పాల్గొన్నారు. ద్వారకా తిరుమలలో బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆమె నివాళులు అర్పించారు. టీడీపీ నేతల రౌడీయిజంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యం పరిరక్షించాలంటూ నిరసన చేపట్టారు.
Read Also: Palnadu: పల్నాడు జిల్లాలో బాంబులు, కత్తులు, వేట కొడవళ్లు కలకలం
తానున్న ఇంటిపై దాడి చేయాల్సిన అవసరం ఏమి వచ్చిందని హోంమంత్రి ప్రశ్నించారు. ఎవరు ఎంత రెచ్చగొట్టినా వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోవద్దన్నారు. ప్రజలంతా కూడా జగనన్న పరిపాలనకు ముగ్ధులై.. ఏదేమైనా ఫ్యాన్ గుర్తుపై ఓటేయాలని ఎదురుచూస్తున్నారన్నారు. భౌతికంగా దాడులు చేసి.. వైసీపీ శ్రేణులు చేసినట్టు లైవ్ లు పెట్టారని విమర్శించారు. గోపాలపురం నియోజకవర్గం లో ఒక రెడ్ బుక్ ఉందని అంటున్నారని.. ఒక్కసారి కూడా ఎన్నిక కాని వారు గూండా రాజకీయాలు చేస్తున్నారన్నారు. రాత్రి జరిగిన దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. తానేమీ వారికి ఛాలెంజ్లు కూడా చేయలేదని.. మా నాయకుడు చేసిన మంచే మాట్లాడానన్నారు. జగనన్న దళితురాలినైన తనకు హోం మంత్రి పదవి ఇచ్చారన్నారు. తనపైనే దాడి చేశారని.. అధికారం లేని సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. నోటికి వచ్చిన వాగ్దానాలు ఇస్తున్నారని.. చట్టం ఎవరికి చుట్టం కాదన్నారు. ప్రతి కార్యకర్త ఎలక్షన్పై దృష్టి పెట్టాలన్నారు.