NTV Telugu Site icon

Toor Dal : తాండూరు కందికి భౌగోళిక గుర్తింపు

Toor Dal

Toor Dal

తాండూరు కందికి భౌగోళిక గుర్తింపు లభించింది. నాణ్యతాపరంగా తాండూరు కందికి విశిష్ట లక్షణాలు ఉండటంతో.. రుచి, సువాసన మరియు పోషకాలలో దేశవ్యాప్తంగా డిమాండ్ ఉంది. తాండూరు నేలల స్వభావం, నేలలలోని పోషకాలు, అనుకూల వాతావరణ పరిస్థితులు, రైతులు ఆచరించే సాంప్రదాయ మరియు ఆధునిక యాజమాన్య పద్దతుల మూలంగా ప్రత్యేక గుర్తింపు లభించింది. వికారాబాద్ జిల్లా తాండూరు, పెద్దేముల్, యాలాల, బషీరాబాద్ మండలాలలోని లక్ష 48 వేల ఎకరాలలో కంది సాగు చేస్తున్నారు రైతులు. ఇప్పటి వరకు దేశమంతటా భౌగోళిక గుర్తింపు కోసం వివిధ రంగాల నుండి వెయ్యి దరఖాస్తులు వెళ్లాయి.. అయితే.. 432 ఉత్పత్తులకు మాత్రమే భౌగోళిక గుర్తింపు వచ్చింది. ఆజాది కా అమృత్ ఉత్సవాలలో 75 ఉత్పత్తులు జిఐ జర్నల్ లో ప్రచురణ చేసింది. ఈ ఏడాది వచ్చిన దరఖాస్తులలో కేవలం 9 ఉత్పత్తులకు గుర్తింపు పొందగా.. అందులో తాండూరు కంది ఒకటి కావడం విశేషం. మొత్తం ఇప్పటి వరకు తెలంగాణ ప్రాంతానికి 16 ఉత్పత్తులకు గుర్తింపు వచ్చింది.

Also Read : Arikomban : రేషన్ షాపుకు వెళ్లిన ఏనుగు.. బియ్యం లేవన్న కోపంతో ఏంచేసిందంటే

తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆరు ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు.. పుట్టపాక తేలియ రుమాలు (2015), బంగినపల్లి మామిడి (2017), ఆదిలాబాద్ ఢోక్రా, వరంగల్ డురీస్(2018), నిర్మల్ పెయింటింగ్ (2019), తాండూరు కంది (2022) గుర్తింపు పొందిన వాటిలో ఉన్నాయి. అందులో మామిడి, కంది వ్యవసాయ ఉత్పత్తులు కావడం విశేషం. వండిన పప్పు ఎక్కువకాలం నిల్వ ఉండడం, తొందరగా ఉడకడం, మంచి రుచి, వాసన తాండూరు కంది ప్రత్యేకత. తాండూరు ప్రాంతంలో ఉన్న సున్నపురాయి నిక్షేపాల వల్ల వచ్చే పోషక నాణ్యతలే దీనికి కారణం. దేశంలోని ఢిల్లీ, ముంబయి, కోల్ కతాలలో తాండూరు కంది బ్రాండ్ కు డిమాండ్ ఉంది.

Also Read : Kalvakuntla Himanshu : చదువుతో పాటు సామాజిక సేవకూ సమ ప్రాధాన్యత ఇస్తా

భౌగోళిక గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్న యాలాల రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘం మరియు తాండూరు కంది పరిశోధనకు స్థానం లభించింది. భౌగోళిక గుర్తింపు సాధించిన నేపథ్యంలో ఆ ప్రాంత రైతులు, వ్యవసాయ విద్యాలయం సంచాలకులు డాక్టర్ జగదీశ్వర్, కంది పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ సుధాకర్ లను అభినందించారు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఈ నెల 31న కంది పరిశోధనా కేంద్రంలో తాండూరు రైతులు, శాస్త్రవేత్తలను మంత్రులు, శాస్త్రవేత్తలు అభినందించనున్నారు.