School Midday Meal: తమిళనాడు ప్రభుత్వం సర్కార్ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఓ తీపి కబురు అందించే దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం బడుల్లో పిల్లలకు చికెన్ బిర్యానీ వడ్డించే ప్రతిపాదనపై మరోసారి స్పష్టత ఇచ్చింది. ఇది ముఖ్యమంత్రి డ్రీమ్ ప్రాజెక్ట్ అని సదరు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి రాజ్ మోహన్ వెల్లడించారు. అయితే ఈ పథకాన్ని వెంటనే అమలు చేయడం కుదరదని, పరిశుభ్రత, ఆహార భద్రతే తమకు మొదటి ప్రాధాన్యమని మంత్రి చెప్పారు. ముందుగా కొన్ని ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్ట్ చేపట్టి, నాణ్యతా ప్రమాణాలను పరీక్షించిన తర్వాతే రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పుళల్ జైల్లో ఉండే ఖైదీలకే చికెన్ బిర్యానీ ఇస్తున్నప్పుడు, రేపటి పౌరులైన మన బడి పిల్లలకు ఎందుకు ఇవ్వకూడదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిజానికి ఈ ప్రతిపాదన ఈ ఏడాది జూలై నుంచే పరిశీలనలో ఉంది. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా వారానికి ఒకసారి విద్యార్థులకు చికెన్ బిర్యానీ పెట్టాలని ప్రభుత్వం భావించింది. పెరిగే పిల్లలకు సరైన ప్రొటీన్లు అందడం చాలా అవసరమని, దీని వెనుక ఎలాంటి రాజకీయం లేదని రాజ్ మోహన్ వివరించారు. తమిళనాడులో విద్యా విప్లవం ఎప్పుడూ పోషకాహార విప్లవంతో పాటే ముడిపడి సాగుతుందని గుర్తుచేశారు. శాకాహారం తినే పిల్లలకు యథావిధిగా వెజ్ భోజనం అందుతుందని, కేవలం మాంసాహారం తినే పిల్లలకే బిర్యానీ ఆప్షన్ ఉంటుందని స్పష్టం చేశారు.
ఇంత పెద్ద ఎత్తున వంట చేయడం, పాఠశాలలకు చేర్చడం సులభం కాదు కాబట్టి, సకల సదుపాయాలు, పరిశుభ్రత పక్కాగా ఉన్నాయని నిర్ధారించుకున్నాకే బిర్యానీ అందిస్తారు. తమిళనాడులో ఇప్పటికే విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజనంతో పాటు ప్రత్యేక ఉదయం టిఫిన్ (బ్రేక్ఫాస్ట్) పథకం కూడా అమలవుతోంది. పిల్లల హాజరు శాతం పెంచడం, వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ బ్రేక్ఫాస్ట్ మెనూలో కూడా కొన్ని మార్పులు, చేర్పులు తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే తమిళనాడు సర్కారీ బడుల్లో ఘుమఘుమలాడే చికెన్ బిర్యానీ సువాసనలు చూడవచ్చు.

