Crime News: మరో ఆణిముత్యం.. భార్య చేతిలో భర్త బలి! మూడేళ్ల కుమార్తెను ఆరా తీయగా

  • తమిళనాడులో మరో ఆణిముత్యం
  • భార్య చేతిలో మరో భర్త బలి
  • మూడేళ్ల కుమార్తె అంతా చెప్పేసింది
Husband Killed By Wife Tn

Husband Killed By Wife Tn

Husband Killed by Wife and Her Lover in Tamil Nadu: భార్య చేతిలో మరో భర్త బలైన ఘటమ తమిళనాడులో చోటుచేసుకుంది. మూడేళ్ల కుమార్తె చెప్పిన సమాచారంతో పోలీసులు తల్లి, ఆమె ప్రియుడిని అరెస్టు చేశారు. వేలూరు జిల్లా ఒడుకత్తూర్ వద్ద కుప్పంపాళ్యానికి చెందిన భారత్ (36) చెన్నైలోని ఓ హోటల్లో వంట మాస్టర్‌గా పని చేస్తున్నాడు. ఇతనికి ఐదేళ్ల కిందట బెంగళూరుకు చెందిన 26 ఏళ్ల నందినితో వివాహమైంది. వారికి నాలుగు, మూడేళ్ల వయ సున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారాంతపు సెలవు రోజుల్లో భార్యాపిల్లలను చూసేందుకు భారత్ ఇంటికొస్తుంటాడు.

ఈ నెల 21న ఇంటికొచ్చిన భారత్.. సరకుల కోసం భార్య, చిన్న కుమార్తెను తీసుకుని ద్విచక్ర వాహనంపై దుకాణానికి వెళ్లాడు. తిరిగొస్తున్నప్పుడు రోడ్డులో కొబ్బరిమట్టలు అడ్డుగా ఉండటంతో వాటిని దాటే యత్నంలో అదుపుతప్పి కిందపడిపోయాడు. అక్కడే దాక్కున్న ఓ వ్యక్తి ఆయుధంతో భారత్‌పై తీవ్రంగా దాడి చేసి పారిపోయాడు. బాధితుడు ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

విచారణలో నందిని పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు సందేహం వచ్చింది. భారత్ చిన్న కుమార్తెను ఆరా తీయగా.. సంజయ్ మామ తన తండ్రిపై దాడి చేసినట్లు చెప్పింది. నందినికి ఎదురింట్లో ఉండే 21 ఏళ్ల సంజయ్ తో వివాహేతర సంబంధం ఉంది. విషయం తెలిసి భారత్ పలుమార్లు తన భార్య నందిని హెచ్చరించాడు. దీంతో భారత్‌ను హతమార్చేందుకు ఇద్దరూ పథకం వేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పోలీసులు నిందితులిద్దరినీ కోర్టులో హాజరుపర్చి జైలుకు తరలించారు.