Tamil Nadu Assembly: తమిళనాడు రాజకీయాల్లో కీలక ఘట్టం చోటుచేసుకుంది. రాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్షకు సంబంధించిన తీర్మానాన్ని సీఎం విజయ్ ప్రవేశపెట్టారు. తమ ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధికార పక్షానికి పలు మిత్రపక్షాలు బహిరంగ మద్దతు ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (INC) పార్టీ విజయ్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించింది. మహిళల భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, అదే కారణంగా మద్దతు ఇస్తున్నామని కాంగ్రెస్ నేతలు తెలిపారు. పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
మరో మిత్రపక్షమైన విదుతలై చిరుతైగల్ కట్చి (VCK) కూడా విజయ్ ప్రభుత్వానికి మద్దతు తెలిపింది. అయితే డీలిమిటేషన్ అంశంపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరింత గట్టిగా పోరాడాలని విజయ్ను కోరింది. అదేవిధంగా వామపక్ష పార్టీలు కూడా ప్రభుత్వానికి అండగా నిలిచాయి. ఇక ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML), అమ్మ మక్కల్ మున్నెట్ట్రా కజగం (AMMK) కూడా మద్దతు ప్రకటించడంతో విజయ్ ప్రభుత్వానికి అసెంబ్లీలో ఎలాంటి ఇబ్బందులు లేవనే సంకేతాలు కనిపిస్తున్నాయి. మరోవైపు అల్ ఇండియా అన్న ద్రావిడ మున్నేట్ర కజగం (అన్నాడీఎంకే) మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలిచింది. K. పళనిస్వామి నేతృత్వంలోని పార్టీ బలపరీక్షలో విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వకుండా వ్యతిరేకంగా ఓటు వేసింది. దీంతో అసెంబ్లీలో అధికార పక్షం తన బలం మరోసారి నిరూపించుకున్నట్లయింది.
