NTV Telugu Site icon

Congress: కాంగ్రెస్‌కు మరో షాక్.. బీజేపీలో చేరిన ప్రియాంక సన్నిహితుడు

Priyanka Adie

Priyanka Adie

సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు వరుస దెబ్బలు తగలుతున్నాయి. కీలక నేతలంతా హస్తం పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో ముఖ్య నాయకులు పార్టీని వీడారు. తాజాగా హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన కీలక నేత, ప్రయాంకాగాంధీ అత్యంత సన్నిహితుడిగా పేరు పొందిన తజిందర్ సింగ్ బిట్టు కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. ఢిల్లీ బీజేపీ కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే, కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ సమక్షంలో కాషాయ పార్టీలో చేరారు. మెడలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఇది కూడా చదవండి: China: కుంగిపోతున్న చైనా.. ప్రమాదంతో 3వ వంతు ప్రజలు..

తజిందర్ సింగ్ బిట్టుకు కాంగ్రెస్‌తో 35 ఏళ్ల అనుబంధం ఉంది. హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ కార్యదర్శిగా ఉన్నారు. ప్రియాంక సన్నిహితుడిగా కూడా పేరు పొందారు. బీజేపీలో చేరకముందు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేకు తజిందర్ సింగ్ బిట్టు రాజీనామా లేఖ పంపించారు. కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి, హిమాచల్ ప్రదేశ్ కో-ఇంఛార్జ్ కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు. బరువెక్కిన హృదయంతో 35 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానంటూ తన రాజీనామా లేఖను ఫేస్‌బుక్ పోస్ట్‌లో షేర్ చేశారు.

ఇక రెండుసార్లు జలంధర్ ఎంపీగా ఎన్నికైన సంతోక్ సింగ్ చౌదరి భార్య కరమ్‌జిత్ కౌర్ చౌదరి కూడా శనివారం బీజేపీలో చేరారు. గత ఏడాది రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో మరణించిన భర్త సంతోక్ సింగ్ చౌదరి భార్య కరమ్‌జిత్ కౌర్ మాత్రం కాంగ్రెస్‌ తీరుపై మండిపడ్డారు. కాంగ్రెస్ తన వారసత్వాన్ని అగౌరవపరిచిందని ధ్వజమెత్తారు. జలంధర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీని పోటీకి దింపడం పట్ల కరమ్‌జీత్ కౌర్ అసంతృప్తితో ఉన్నారు. తన కుటుంబం అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిందని.. విధేయత తన రక్తంలో ఉందని ఆమె తెలిపారు. లోక్‌సభ ఎన్నికల ముందు ముఖ్య నేతలు పార్టీని వీడడం కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బగానే చెప్పొచ్చు.

ఇది కూడా చదవండి: Kohli DK: ‘నీ భార్య’.. అంటూ దినేష్ కార్తీక్ కు మాటరాకుండా చేసిన కోహ్లీ.. వీడియో వైరల్..

ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్‌లో మాజీ ఎమ్మెల్యే సహా పలువురు కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరారు. భోపాల్‌లోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సమక్షంలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే హరి వల్లభ్ శుక్లా తన మద్దతుదారులతో కలిసి బీజేపీలో చేరారు. ఇటీవలే కాంగ్రెస్ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్, ఒలింపిక్ పతక విజేత మరియు బాక్సర్ విజేందర్ సింగ్ కూడా కాంగ్రెస్‌ను వీడారు. ముంబయిలోని ప్రముఖ నాయకుడు సంజయ్ నిరుపమ్ కూడా హస్తం పార్టీని వీడారు.