T20 World Cup 2026: నేటి నుంచి టీ 20 వరల్డ్ కప్ షురూ అవుతుంది. ఇప్పటికీ పాకిస్థాన్ విషయంలో పరిస్థితి గందరగోళంగా ఉంది. గ్రూప్-ఏలో భారత్తో జరిగే మ్యాచ్ను నిజంగా బహిష్కరిస్తే.. ఇక మిగిలిన ప్రతి మ్యాచ్ వారికి ఫైనల్లా మారనుంది. నెదర్లాండ్స్, నమీబియా, అమెరికా జట్లతో ఆడే మ్యాచ్లలో తప్పక గెలవాల్సిందే. ఒక్క ఓటమి వచ్చినా, తదుపరి దశకు వెళ్లడం కష్టమే. ఈ కీలక సమయంలో పాకిస్థాన్ జట్టు కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా సంచలన వ్యాఖ్యలు చేశాడు. జట్టుకు ఏ కాంబినేషన్ బాగుంటుందో ఎంచుకుంటామని స్పష్టంగా చెప్పాడు. అవసరం అయితే అనుభవం ఉన్న ప్లేయర్లను పక్కన పెట్టడానికి సిద్ధమేనని చెప్పడం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. బాబర్ ఆజమ్, ఫఖర్ జమాన్ లాంటి సీనియర్ ఆటగాళ్లు కూడా జట్టు కాంబినేషన్కు సరిపోకపోతే ప్లేయింగ్ ఎలెవెన్లో చోటు ఉండదని ఆఘా తేల్చి చెప్పాడు.
READ MORE: Tirumala Laddu Controversy: తిరుమల లడ్డూ వ్యవహారం.. ముగ్గురు మంత్రులతో కమిటీ..!
అయితే దీనికి వెంటనే ఓ స్పష్టత సైతం ఇచ్చాడు. తాను బాబర్, ఫఖర్ పేర్లు ఉదాహరణగా మాత్రమే చెప్పానన్నాడు. ఫఖర్ గత దశాబ్దకాలంగా పాకిస్థాన్కు ఎన్నో కీలక ఇన్నింగ్స్ ఆడాడని, అలాగే బాబర్ సైతం ఎన్నో సార్లు జట్టును గెలిపించాడని గుర్తు చేశాడు. వాళ్లిద్దరికీ తన పూర్తి మద్దతు ఉంటుంది. కానీ చివరికి జట్టుకు ఏది మంచిదో, అదే నిర్ణయం తీసుకుంటామని చెప్పాడు. మరోవైపు తన పాత్ర గురించి సల్మాన్ అలీ ఆఘా స్పష్టత ఇచ్చాడు. టీ20 వరల్డ్కప్ ఆరంభంలో తాను నంబర్-3 స్థానంలోనే బ్యాటింగ్ చేస్తానని చెప్పాడు. “పవర్ప్లేలో ప్రత్యర్థి జట్లు ఎక్కువగా స్పిన్నర్లకు అవకాశం ఇస్తారు. స్పిన్ను నేను బాగా ఎదుర్కొనగలను, వేగంగా పరుగులు తీయగలను. అందుకే నేను నంబర్-3 లో బ్యాటింగ్ చేయాలని చెప్పారు. ఇక అదే స్థానంలో కొనసాగుతాను” అని ఆఘా అన్నాడు. మొత్తానికి పాకిస్థాన్ జట్టు బలమైన నిర్ణయాలు తీసుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. చివరకి ఏం జరుగుతుందో చూడాలి.
