Italy Cricket Team Captain Joe Burns on T20 World Cup 2026: ఫుట్బాల్కు పేరుగాంచిన ఇటలీ.. క్రికెట్లో టీ20 ప్రపంచకప్ ఆడే అవకాశాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. ఐరోపా టీ20 ప్రపంచకప్ క్వాలిఫయర్లో సత్తాచాటిన ఇటలీ.. భారత్, శ్రీలంక ఉమ్మడిగా ఆతిథ్యం ఇచ్చే 2026 టీ20 ప్రపంచకప్లో ఆడనుంది. క్రికెట్లో ఐసీసీ టోర్నీకి అర్హత సాధించడం ఇటలీకి ఇదే మొదటిసారి కావడం విశేషం. టీ20 ప్రపంచకప్కు అర్హత సాధించడంతో ఇటలీ క్రికెటర్లు ఆనందంలో మునిగితేలుతున్నారు. తాజాగా ఇటలీ కెప్టెన్ జో బర్న్స్ తన సంతోషంను పంచుకున్నాడు. ప్రపంచకప్కు అర్హత సాధించామంటే ఇప్పటికీ తాను నమ్మలేకపోతున్నా అని తెలిపాడు.
విల్లో టాక్ పాడ్కాస్ట్లో ఆడమ్ పీకాక్తో జో బర్న్స్ మాట్లాడాడు. ‘ప్రపంచకప్కు అర్హత సాధించామంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. జట్టు ప్రదర్శన పట్ల గర్వంగా ఉంది. అందరం చాలా శ్రమించాం. ఒకటి, రెండు రోజులు కాదు.. నెలలు, సంవత్సరాలు కలలు కంటూ నమ్మకంతో సిద్ధమవుతూ ఉన్నాం. క్రికెట్ ఆటలో కొన్ని విషయాలు జరిగినప్పుడు ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రస్తుతం మేం అదే అనుభవిస్తున్నాం. టోర్నమెంట్ మొదటి రోజు నుండి ప్రతిదీ ప్రణాళిక ప్రకారం జరిగినప్పుడు చాలా సంతృప్తికరంగా ఉంటుంది’ అని జో బర్న్స్ తెలిపాడు.
Also Read: Junior Review: కిరీటి ‘జూనియర్’ రివ్యూ
‘మొదటిసారిగా ప్రపంచకప్నకు వెళ్లే ఏ జట్టైనా చాలా ప్రత్యేకంగా ఉండాలని భావిస్తుంది. తొలి మ్యాచ్లో భారత్తో, అలానే ఫైనల్లో ఆస్ట్రేలియాతో ఇటలీ తలపడాలని కోరుకుంటున్నా. నేను ఇప్పటివరకు ప్రపంచకప్లో ఆడలేదు. ఇది ఇటలీకి తొలి ప్రపంచకప్. మేము ముందే వెళ్లి బాగా సిద్ధం అవ్వాలనుకున్నాం. ప్రపంచ వేదికపై ఇటలీ జెండాను నిలబెట్టే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాం. పెద్ద జట్లతో ఆడడంను ఎప్పటికీ మరచిపోలేము’ అని జో బర్న్స్ పేరొన్నాడు. జో బర్న్స్ ఆస్ట్రేలియన్ క్రికెటర్ అన్న విషయం తెలిసిందే. ఆసీస్ తరఫున 23 టెస్టులు, ఆరు వన్డేలు ఆడాడు. ప్రస్తుతం అతడు ఇటలీకి సారథ్యం వహిస్తున్నాడు. ఈసారి ప్రపంచకప్లో 20 జట్లు ఆడనుండగా.. ఇప్పటికే 15 జట్లు అర్హత సాధించాయి. తూర్పు ఆసియా-పసిఫిక్ నుండి మూడు, ఆఫ్రికన్ క్వాలిఫయర్స్ నుండి రెండు జట్లు అర్హత సాధించాల్సి ఉంది.