Suryakumar Yadav: పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ఆ క్షణం మర్చిపోలేను.. ఒళ్లంతా చెమటలు పట్టాయ్..

Suryakumar Yadav

Suryakumar Yadav

Suryakumar Yadav: భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ క్రికెట్ మైదానంలో ఎంత కూల్‌గా ఉంటాడో, మైదానం బయట కూడా అంతే సరదాగా స్పందిస్తుంటాడు. తాజాగా ప్రముఖ క్రికెట్ విశ్లేషకుడు ఆకాష్ చోప్రా టాక్ షో ‘బైఠ్ & బోల్’ (Baith & Bol) మొదటి ఎపిసోడ్‌లో పాల్గొన్న సూర్య, తన కెరీర్‌తో పాటు కెప్టెన్సీ ప్రయాణంలోని పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. సంభాషణలో భాగంగా ఆకాష్ చోప్రా, “ఒకవేళ తదుపరి మ్యాచ్‌కు భారత జట్టును ఎంపిక చేసినప్పుడు మీ పేరు లేకపోతే ఎలా స్పందిస్తారు?” అని ప్రశ్నించగా, సూర్య ఎంతో ప్రశాంతంగా సమాధానమిచ్చాడు. గతంలో జట్టులో తన పేరు లేనప్పుడు కూడా సరిగ్గా ఇలాగే నవ్వానని చెప్పాడు. జట్టు భవిష్యత్తు కోసం సెలక్టర్లు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, దానిని గౌరవించి స్వీకరిస్తానని స్పష్టం చేశాడు.

ఇక ఇటీవల తన హయాంలో వచ్చిన టీ20 వరల్డ్ కప్ గురించి మాట్లాడుతూ.. 2023 ప్రపంచకప్ ఓటమి తర్వాత అహ్మదాబాద్ స్టేడియం మైదానంపై రకరకాల నెగెటివ్ వార్తలు వచ్చాయి. కానీ, ఈసారి ఎలాగైనా ఆ సెంటిమెంట్‌ను తిరగరాయాలని బలంగా నిశ్చయించుకున్నట్లు చెప్పాడు. అహ్మదాబాద్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ విజయం తర్వాతే ‘మనం ప్రత్యేకంగా ఏదో సాధించబోతున్నాం’ అనే బలమైన నమ్మకం జట్టులో ఏర్పడిందని పేర్కొన్నాడు. జట్టు ఎంపికలో అత్యంత కష్టమైన నిర్ణయం ఏంటని అడిగినప్పుడు, సంజూ శాంసన్ పేరును ప్రస్తావించాడు సూర్య. “పోటీలో జట్టు కలయిక వల్ల ప్రతిభ ఉన్న ఆటగాడిని ప్లేయింగ్ ఎలెవన్‌లో తీసుకోలేకపోవడం చాలా బాధాకరం” అని అంగీకరించాడు. అయితే, టోర్నీ మధ్యలో జట్టులోకి వచ్చి, తుది మ్యాచ్‌ వరకు రాణించి ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచిన సంజూ ప్రదర్శన పట్ల తనకున్న గౌరవం రెట్టింపైందని కొనియాడాడు.

పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్ అనగానే సహజంగానే ఒత్తిడి ఉంటుంది. కానీ మ్యాచ్ ప్రారంభంలో తనకు ఎలాంటి ఒత్తిడి అనిపించలేదని సూర్య తెలిపాడు. అయితే 13వ ఓవర్ సమయంలో హార్దిక్ పాండ్యా వికెట్ పడిపోగానే మ్యాచ్ పూర్తిగా మారిపోయిందని, ఆ సమయంలో ఒత్తిడితో ఒళ్లంతా చెమటలు పట్టేశాయని ఆ క్షణాలను గుర్తుచేసుకున్నాడు. ఇక, పేసర్ జస్ప్రీత్ బుమ్రా గురించి మాట్లాడుతుంటే సూర్య ముఖంలో ప్రత్యేకమైన ఆనందం కనిపించింది. బుమ్రా వేసే 24 బంతులు ‘అపరంజి బంగారం’ లాంటివని, వాటిని చాలా జాగ్రత్తగా, సమయానుకూలంగా వాడుకోవాల్సి ఉంటుందని చెప్పాడు. కష్టసమయాల్లో బుమ్రా స్వయంగా ముందుకు వచ్చి “నేను చూసుకుంటాను, మీ పని నేను పూర్తి చేస్తాను” అని కెప్టెన్‌కు భరోసానిచ్చే తీరు అద్భుతమని మెచ్చుకున్నాడు.