Supreme Court: కేంద్ర ఎన్నికల కమిషనర్గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన అరుణ్ గోయల్ నియామక దస్త్రాలను తమ ముందు ఉంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. కేంద్రం హడావుడిగా ఆయనను ఈసీగా నియమించడంపై సర్వోన్నత న్యాయస్థానం సర్వోన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో రుణ్ గోయల్ నియామకానికి సంబంధించిన దస్త్రాన్ని గురువారం తమ ముందు ఉంచాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకం కోసం కొలీజియంలాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతోంది. ఈ సందర్భంగానవంబర్ 19వ తేదీన రిటైర్డ్ బ్యూరోక్రాట్ అరుణ్ గోయల్ను కేంద్ర ఎన్నికల కమిషనర్గా నియమించడంపై పలు సందేహాలు వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఆయన నియామకానికి సంబంధించిన దస్త్రాలను గురువారం కోర్టు ముందు ఉంచాలని జస్టిస్ కేఎం జోసెఫ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది. స్వచ్ఛంద పదవీ విరమణ ఇచ్చిన వెంటనే ఆయనను ఎన్నికల విభాగానికి కమిషనర్గా నియమించడంపై కేంద్రాన్ని సూటిగా నిలదీసింది.
సుప్రీంకోర్టులో ఎన్నికల కమిషనర్ల నియామకంపై విచారణ ప్రారంభమైన మూడు రోజుల్లోనే నియామకం జరిగిందన్న ధర్మాసనం అలా జరగకుండా ఉంటే మరింత సముచితంగా ఉండేదని వ్యాఖ్యానించింది. అరుణ్ గోయల్ నియామకానికి సంబంధించిన దస్త్రాలను గురువారం తీసుకురావాలని అటార్నీ జనరల్ను ఆదేశించింది.ఈ కేసును విచారించడం మొదలు పెట్టిన తర్వాత నియామకం జరిగినందున ఆ దస్త్రాలను చూడాలనుకుంటున్నట్లు న్యాయస్థానం పేర్కొంది. కాగా, ఎన్నికల సంఘం వ్యవస్థ ప్రకారమే సీఈసీ, ఈసీల ఎంపిక జరుగుతోందని అటార్నీ జనరల్ వెంకటరమణి కోర్టుకు తెలిపారు. ప్రధాని నేతృత్వంలోని మంత్రివర్గం సిఫార్సు చేసిన వారిలో ఒకరిని రాష్ట్రపతి ఎంపిక చేస్తారని వెల్లడించారు. ఆ మెకానిజాన్ని తప్పుపట్టడం తగదని అన్నారు. సీఈసీ నియామక ప్రక్రియలో ప్రస్తుతం ఉన్న వ్యవస్థ సరిగ్గానే ఉందని, ఇందులో కోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని అటార్నీ జనరల్ అన్నారు.
Clash in school over hijab: స్కూల్లోనూ హిజాబ్ వివాదం.. రెండు వర్గాల మధ్య ఘర్షణ, పరీక్షలు రద్దు
దీనిపై స్పందించిన ధర్మాసనం ఈ వ్యవస్థ సరిగా లేదని తాము చెప్పడం లేదని పేర్కొంది. నియామకం కోసం అనుసరించిన ప్రక్రియ ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నట్లు న్యాయస్థానం తెలిపింది. ఈ నియామకం చట్టబద్ధమైనదైతే భయపడాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది. ఎన్నికల కమిషనర్ల నియామకంలో సీబీఐ డైరెక్టర్ తరహాలో ప్రధాని, ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన కమిటి ద్వారా ఎంపిక జరపాలని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా కేంద్రాన్ని ఈ మేరకు సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎన్నికల సంఘం స్వతంత్రంగా పని చేయాలంటే పారదర్శక నియామక ప్రక్రియ ఉండాలని ధర్మాసనం సూచించింది. ప్రధానికి వ్యతిరేకంగా ఏమైనా ఆరోపణలు వస్తే ప్రభుత్వం నియమించిన సీఈసీ ప్రధానిపై చర్యలు తీసుకోలేరని అభిప్రాయపడింది. అలా అయితే అది వ్యవస్థను నిర్వీర్యం చేసినట్లనని పేర్కొంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అవసరమైతే ప్రధానిపై చర్యలు తీసుకునే సీఈసీ కావాలని.. అందుకే సీఈసీ నియామకం కోసం ప్రత్యేక ప్రక్రియ అవసరమని వెల్లడించింది. ఈ నియామకం కోసం ఏర్పాటు చేసే కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా సభ్యుడిగా చేర్చాలని ధర్మాసనం అభిప్రాయపడింది. ఒకవైపు సీఈసీ, ఈసీల నియామక పిటిషన్లపై కోర్టులో విచారణ జరుగుతుండగా అరుణ్ గోయల్ను ఎలా నియమించారంటూ కేంద్రాన్ని నిలదీసింది. అరుణ్ గోయల్ నియామకానికి సంబంధించిన ఫైళ్లను తమకు సమర్పించాలని కోరిన బెంచ్.. విచారణను గురువారానికి వాయిదా వేసింది.