Supreme Court: తమిళనాడులో హిందీ భాష, నవోదయ విద్యాలయాల ఏర్పాటు అంశంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రతీ జిల్లాలో నవోదయ విద్యాలయాల కోసం భూమిని కేటాయించాలని గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్ని వెనక్కి తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. జస్టిస్ బీవీ నాగరత్న తమిళనాడు ప్రభుత్వ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
‘‘హిందీని రాష్ట్రం నుంచి పూర్తిగా దూరం ఉంచలేరు’’ అని, తమిళనాడు ‘‘మైండ్ సెట్’’ మార్చుకోవాలని, భాషా అంశంపై కేంద్రంతో చర్చలు జరపాలని తమిళనాడు ప్రభుత్వానికి సూచించింది. నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు ప్రతీ జిల్లాలో భూమిని కేటాయించే ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయాలని కోర్టు సూచించింది. ఈ అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్యలు ‘సమాఖ్యవాదం’ స్పూర్తితో జరగాలని పేర్కొంది.
తమిళనాడు తరుఫున హాజరైన సీనియర్ న్యాయవాది జైదీప్ గుప్తా.. నవోదయ విద్యాలయాల ద్వారా హిందీ భాషకు ప్రాధాన్యత పెరిగి, తమిళ భాషపై ప్రభావం పడే అవకాశం ఉందని కోర్టుకు తెలిపారు. అయితే, నవోదయ పాఠశాలలు రాష్ట్ర భాషా విధానానికి వ్యతిరేకంగా ఉండాల్సిన అవసరం లేదని, కేంద్రంతో చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. తమిళనాడు ప్రభుత్వం దీనిపై స్పందిస్తూ నవోదయ విధానం తప్పనిసరి కాదని, కేంద్ర ప్రభుత్వ విధానాన్ని రాష్ట్రం తప్పనిసరిగా అమలు చేయాల్సిందేనని కోర్టులు ఆదేశించలేవని వాదించింది. ఇదే సమయంలో తమిళనాడు ‘‘మైండ్ సెట్ మార్చుకోవాలి’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడులో ఒక్క నవోదయ స్కూల్ కూడా లేదు. నవోదయ విద్యాలయాల ఏర్పాటు హిందీ భాషను ప్రోత్సహించేలా ఉందని వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గతంలో మద్రాస్ హైకోర్టు స్కూళ్ల కోసం భూమిని కేటాయించాలని ఆర్డర్స్ ఇచ్చింది. దీనిని వ్యతిరేకిస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలు చేసింది. కేసు తదుపరి విచారణను డిసెంబర్ 14కు వాయిదా వేసింది.

