Supreme Court: పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ బ్లెండింగ్ (E20) ప్రక్రియపై సుప్రీంకోర్టులో మంగళవారం కీలక విచారణ జరిగింది. ఈ పథకం ఇంకా ఒక ప్రయోగ దశలోనే ఉందని, దీని అసలు ఫలితాలు వచ్చే ఏడాది నాటికి మరింత స్పష్టంగా తెలుస్తాయని కేంద్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది. ఇథనాల్ బ్లెండింగ్ వల్ల పాత వాహనాలు పాడవుతాయని, మైలేజ్ తగ్గుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, E20 ఇంధనం వల్ల వాహనాలకు మెకానికల్ నష్టం జరుగుతుందనడానికి ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లేవని కేంద్రం స్పష్టం చేసింది. పైగా ఈ విధానం వల్ల దేశ ఇంధన భద్రత పెరగడంతో పాటు, రైతులకు, పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని పేర్కొంది.
కోర్టులో అసలు వివాదం ఏమిటి?
2025-26 సరఫరా సంవత్సరానికి గాను ఇథనాల్ కేటాయింపులపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఒక ఉత్తర్వును సవాలు చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థ ‘భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్’ (BPCL) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. టెండర్ ప్రక్రియ ముగిసేలోపే, తమకు ఇథనాల్ కేటాయింపులను పెంచాలంటూ ఒక డిస్టిలరీ పెట్టుకున్న దరఖాస్తును పరిశీలించాలని జూన్ 23న కర్ణాటక హైకోర్టు చమురు మార్కెటింగ్ సంస్థలను (OMCs) ఆదేశించింది. హైకోర్టు ఇచ్చిన ఈ ఆదేశం వల్ల దేశవ్యాప్త ఇథనాల్ బ్లెండింగ్ లక్ష్యాలపై తీవ్ర ప్రభావం పడుతుందని BPCL కోర్టుకు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి వాదనలు వినిపిస్తూ.. 2025 అక్టోబర్లోనే ఇథనాల్ కేటాయింపుల ప్రక్రియ పూర్తయిందని, సరఫరా ఒప్పందాలు కూడా ఖరారయ్యాయని చెప్పారు. ఇప్పుడు ఒక సంస్థ కోసం కేటాయింపులను మారిస్తే, మిగిలిన సంస్థలు కూడా కోర్టులను ఆశ్రయిస్తాయని, దీనివల్ల దేశవ్యాప్త సరఫరా గొలుసు దెబ్బతింటుందని హెచ్చరించారు. ఇలాంటి పిటిషన్లు పలు హైకోర్టుల్లో పెండింగ్లో ఉన్నాయని ఆయన గుర్తుచేశారు.
ప్రభుత్వ వ్యూహం.. భారీగా ఆఫర్లు
ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమాన్ని సమన్వయం చేస్తున్న BPCLకు టెండర్ ప్రక్రియ ద్వారా దాదాపు 1,759 కోట్ల లీటర్ల ఇథనాల్ సరఫరా ఆఫర్లు వచ్చాయని అటార్నీ జనరల్ కోర్టుకు వివరించారు. రాబోయే అక్టోబర్లో ఈ సరఫరా ఒప్పందాలు మళ్లీ పునరుద్ధరణకు రానున్న నేపథ్యంలో ఈ వివాదాలన్నింటినీ ఒకేచోటికి చేర్చి విచారించేలా ట్రాన్స్ఫర్ పిటిషన్ దాఖలు చేయడానికి ఆయన అనుమతి కోరారు. కోర్టు విచారణ అనంతరం అటార్నీ జనరల్ స్పష్టత ఇస్తూ.. “పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ కలపాలనేది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం, ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. కాకపోతే డిమాండ్, ఇతర అంశాల ఆధారంగా కంపెనీలకు లభించే ఇథనాల్ పరిమాణంలో హెచ్చుతగ్గులు ఉండవచ్చు” అని పేర్కొన్నారు.
భారతదేశం తన 20 శాతం ఇథనాల్ బ్లెండింగ్ లక్ష్యాన్ని నిర్దేశిత సమయం కంటే ఐదేళ్ల ముందే (గత ఏడాది) సాధించింది. చమురు మార్కెటింగ్ సంస్థలు ఏప్రిల్ 1 నుండి దేశవ్యాప్తంగా ఈ ఇంధనాన్ని సరఫరా చేస్తున్నాయి. కాగా, 2030 నాటికి ఈ బ్లెండింగ్ శాతాన్ని 30 శాతానికి పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. E20 ఇంధనం వాడటం వల్ల వాహనాల ఇన్సూరెన్స్ క్లెయిమ్లకు ఎలాంటి ముప్పు ఉండదని కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ ఇటీవలే స్పష్టం చేసింది. ఇన్సూరెన్స్ పాలసీలు రద్దవుతాయనే ప్రచారంలో నిజం లేదని పేర్కొంది. అమెరికా, బ్రెజిల్, జపాన్ వంటి దేశాల్లో ఇథనాల్ బ్లెండింగ్ విజయవంతంగా సాగుతోందని, దీనివల్ల క్రూడాయిల్ దిగుమతులు తగ్గి భారతదేశానికి రూ. 1.4 లక్షల కోట్లకు పైగా విదేశీ మారక ద్రవ్యం (Foreign Exchange) ఆదా అయిందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పర్యావరణ హితమైన, వినియోగదారులకు సురక్షితమైన పద్ధతిలోనే ఈ కార్యక్రమం ముందుకు సాగుతుందని ప్రభుత్వం పునరుద్ఘాటించింది.

