ఓటింగ్ ప్రక్రియలో మరింత పారదర్శకతను పెంచేందుకు, ఓటరు వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్ (VVPAT) స్లిప్పులపై ఓటు రికార్డైన కచ్చితమైన సమయాన్ని ముద్రించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన ప్రజాహిత పిటిషన్ను సుప్రీంకోర్టు బుధవారం పరిష్కరించింది. ఈ అంశం పూర్తిగా సాంకేతికపరమైనదని, కాబట్టి దీనిపై భారత ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవడమే సమంజసమని కోర్టు స్పష్టం చేసింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా , జస్టిస్ సూర్యకాంత్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించింది. వ్యాపారవేత్త అయిన నల్లా సురేష్ రెడ్డి తరపున సీనియర్ అడ్వకేట్ దేవదత్ కామత్ వాదనలు వినిపించారు.
ప్రస్తుత విధానంలో ఫామ్ 17A (ఓటర్ల భాగస్వామ్యం), ఫామ్ 17C (పోలైన ఓట్లు), EVM కంట్రోల్ యూనిట్లలో ఓట్ల వివరాలు ఉన్నప్పటికీ.. VVPAT స్లిప్పులపై ఓటు వేసిన సమయం ఉండటం లేదు. దీనివల్ల ముఖ్యంగా పోలింగ్ ముగిసే చివరి గంటల్లో ఓటింగ్ సరళిపై వివాదాలు తలెత్తినప్పుడు ‘ఫిజికల్ ఆడిట్ గ్యాప్’ ఏర్పడుతోంది. గత ఎన్నికలలో చివరి నిమిషంలో భారీగా ఓటింగ్ శాతం పెరిగిన ఉదాహరణలను పిటిషనర్ ప్రస్తావించారు. స్లిప్పులపై కచ్చితమైన సమయాన్ని ముద్రించడం ద్వారా ఎన్నికల ప్రక్రియపై నమ్మకం, పారదర్శకత పెరుగుతుందని కోరారు.
టైమ్-స్టాంప్ వేయడం వల్ల ఓటరు వ్యక్తిగత గుర్తింపు లేదా సీరియల్ నంబర్తో ఎలాంటి లింక్ ఉండదు కాబట్టి, ఓటు రహస్యంగానే ఉంటుందని పిటిషనర్ స్పష్టం చేశారు. టైమ్-స్టాంపింగ్తో పాటు స్ట్రాంగ్-రూమ్ యాక్సెస్ లాగ్లు, సీసీటీవీ రికార్డింగ్లు, వీవీపీఏటీ స్లిప్పులను భద్రపరిచే ప్రోటోకాల్స్ను మరింత బలోపేతం చేయాలని పిటిషన్లో కోరారు.
పిటిషనర్ లేవనెత్తిన అంశం ఎన్నికల సమగ్రతకు సంబంధించినదే అయినప్పటికీ.. అందులో కోరిన మార్పులు సాంకేతిక సాధ్యసాధ్యాలతో కూడుకున్నవని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో.. సుప్రీంకోర్టు ఎలాంటి నిర్దిష్ట ఆదేశాలు జారీ చేయకుండానే ఈ పిటిషన్ను ముగించింది. అయితే.. ఈ పిటిషన్ను ఒక వినతిపత్రంగా పరిగణించి పరిశీలించాల్సిందిగా భారత ఎన్నికల సంఘానికి (ECI) పంపాలని కోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది.
