SS Rajamouli: “ఆ అభిమాని ఆఖరి కోరిక తీరింది”.. కెమెరా ముందే కన్నీళ్లు పెట్టుకున్న రాజమౌళి..

Ss Rajamouli1

Ss Rajamouli1

SS Rajamouli: దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన దృశ్య విస్మయం ‘బాహుబలి’. ప్రభాస్ కథానాయకుడిగా రూపొందిన ఈ ఎపిక్ యాక్షన్ డ్రామా, తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పింది. ‘బాహుబలి: ది బిగినింగ్’ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తే.. ఆ తర్వాత వచ్చిన ‘బాహుబలి 2: ది కన్‌క్లూజన్’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్రను లిఖించింది. ఈ సీక్వెల్ విడుదలై దాదాపు తొమ్మిదేళ్లు కావస్తున్నా, అప్పట్లో అది సృష్టించిన రికార్డులను అధిగమించడం ఇప్పటికీ ఎవరికీ సాధ్యం కాలేదు. ఇంతటి అద్భుత దృశ్యకావ్యాన్ని వెండితెరపై ఆవిష్కరించడం వెనుక జక్కన్న బృందం పడిన కఠోర శ్రమను ‘బాహుబలి ది టార్చ్ బ్యారర్’ డాక్యుమెంటరీలో ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో, సినిమా విడుదల తర్వాత తన జీవితంలో చోటుచేసుకున్న ఓ హృదయవిదారక సంఘటనను గుర్తుచేసుకుంటూ రాజమౌళి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆ జ్ఞాపకాన్ని పంచుకుంటూ ఆయన కన్నీటిపర్యంతమయ్యారు.

“మా వదిన (కీరవాణి భార్య శ్రీవల్లి) బయటకు వెళ్లినప్పుడు ఓ వృద్ధురాలు ఆమెను గుర్తుపట్టింది. ‘అమ్మా.. నువ్వు బాహుబలి చిత్ర నిర్మాణంలో భాగస్వామివి కదా?’ అని అడిగింది. అవునని చెప్పగానే.. ఆ పెద్దావిడ కృతజ్ఞతలు తెలుపుతూ తన బాధను పంచుకుంది. ‘నాకు క్యాన్సర్ వ్యాధి ఉంది. మొదటి భాగం చూసినప్పటి నుంచి రెండో భాగం రాకముందే నేను చనిపోతానేమో అని భయపడ్డాను. కానీ దేవుడి దయ వల్ల పార్ట్-2 చూసేవరకు బతికాను. సినిమా చూశాక నా మనసు తృప్తిగా ఉంది’ అని చెప్పింది.” అని రాజమౌళి తెలిపారు. ఈ ఈ విషయాన్ని చెబుతూ రాజమౌళి తన దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు. ఎప్పుడూ ఎంతో గంభీరంగా ఉండే జక్కన్న.. ఓ అభిమాని మాటలకు ఒక్కసారిగా చలించిపోయాడు. ఈ దిగ్గజ డైరెక్టర్ కన్నీళ్లు పెట్టుకోవడం తామెప్పుడూ చూడలేదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఎమోషనల్ వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.