Hardik Pandya and Ben Stokes are my inspirations Said Nitish Kumar Reddy: బాగా ఆడావ్ అని.. సీనియర్ నుంచి ఓ మెసేజ్ వస్తే జూనియర్కు అంతకంటే ఆనందం మరొకటి ఉండదు. గాల్లో తేలిపోతుంటాడు. అలాంటి ఆనందం, సంతోషమే తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి అనుభవించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నితీశ్.. ఐపీఎల్ 2024 ముగిసిన తర్వాత టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా నుంచి ఓ మెసేజ్ వచ్చిందని గుర్తు చేసుకున్నాడు. తాను మెసేజ్ చూసి షాక్ అయ్యానని చెప్పాడు. గాయం నుంచి కోలుకుంటున్న తాను దులీప్ ట్రోఫీ కోసం సన్నద్ధమవుతున్నానని చెప్పాడు.
‘ఐపీఎల్ 2024 ముగిసిన తర్వాత హార్దిక్ పాండ్యా నుంచి ఓ మెసేజ్ వచ్చింది. నేను షాక్ అయ్యాను. బాగా ఆడావ్ అని ప్రశంసించాడు. ఇదే ఇంటెంట్, ఎనర్జీతో ముందుకు కొనసాగాలని సూచించాడు. ఎప్పుడూ ఆటను గౌరవిస్తూ ఉండలన్నాడు. త్వరలోనే నాతో మాట్లాడతానని మెసేజ్ చేశాడు. టీ20 ప్రపంచకప్ 2024 కోసం సన్నద్ధమవుతూ.. ఫుల్ బిజీగా ఉన్న తరుణంలో నాకు మెసేజ్ పంపడంతో ఆశ్చర్యమేసింది. ఆ మెసేజ్కు థాంక్యూ అని రిప్లై ఇచ్చా’ అని నితీశ్ కుమార్ రెడ్డి తెలిపాడు. ఆల్రౌండర్గా ఎదిగేందుకు బెన్ స్టోక్స్, హార్దిక్ తనకు ఆదర్శమని చెప్పాడు.
Also Read: Akash Puri: పేరు మార్చుకున్న ‘పూరీ’ కుమారుడు.. కారణం అదేనా?
ఐపీఎల్ 2024లో నితీశ్ కుమార్ రెడ్డి రాణించిన విషయం తెలిసిందే. సన్రైజర్స్ హైదరాబాద్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. 21 ఏళ్ల నితీశ్ 11 ఇన్నింగ్స్లలో 303 రన్స్ చేశాడు. అంతేకాదు మూడు వికెట్స్ కూడా పడగొట్టాడు. ఐపీఎల్లో అత్యుత్తమ ప్రదర్శన చేయడంతో నితీశ్ రెడ్డికి భారత జట్టులో అవకాశం వచ్చింది. జింబాబ్వేతో ఐదు టీ20ల సిరీస్కు అతడు ఎంపికయ్యాడు. అయితే గాయం కారణంగా వైదొలగాల్సి వచ్చింది.