Mamata Benerjee: బీసీసీఐ అధ్యక్షుడిగా రెండో సారి సౌరవ్ గంగూలీకి అవకాశం ఇవ్వకపోవడంపై తీవ్రంగా స్పందించారు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. గంగూలీని వంచించారని, అన్యాయంగా రేసు నుంచి తప్పించారని ఆమె ఆరోపించారు. గంగూలీ అణచివేతకు గురవుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. గంగూలీని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఛైర్మన్గా పంపాలని ప్రధాని మోడీ విజ్ఞప్తి చేశారు. గంగూలీ బెంగాల్కు మాత్రమే కాదు యావత్ దేశానికి గర్వకారణమని, అత్యంత ప్రజాదరణ గల వ్యక్తి అని ఆమె కొనియాడారు. టీమిండియా కెప్టెన్గా విశేష సేవలందించిన గంగూలీకి అలా అన్యాయం జరగడం తనను షాక్క గురి చేసిందన్నారు. గంగూలీ ఏం తప్పు చేశారని ఆయనను పక్కకు పెట్టారని మమత ప్రశ్నించారు.
సౌరవ్ గంగూలీ విషయంలో జోక్యం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని మమతా బెనర్జీ కోరారు. బీసీసీఐ పదవి ఇవ్వనప్పుడు ఆయనను ఐసీసీకి పంపితే న్యాయం చేసినట్లువుతుందని సూచించారు. అందుకే ఐసీసీ ఛైర్మన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు గంగూలీకి అనుమతి ఇవ్వాలన్నారు. తన విజ్ఞప్తిని ప్రతీకారంగా లేదా రాజకీయంగా తీసుకోవద్దని అభ్యర్థిస్తున్నానన్నారు. క్రికెట్ కోసం, క్రీడల కోసం నిర్ణయం తీసుకోవాలని ఆమె కోరారు.
Congress Presidential Poll: ముగిసిన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోలింగ్.. గెలిచేది ఆయనేనట!
కోల్కతా ఎయిర్ పోర్టులో విలేకరులతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. సౌరవ్ గంగూలీ విషయంలో ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని, ఐసీసీ పదవి కోసం పోటీపడేందుకు గంగూలీకి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ త్వరలోనే పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ బోర్డు పాలనా పగ్గాలు అందుకోనున్నారు. గంగూలీ వరుసగా రెండో పర్యాయం కూడా అధ్యక్షుడిగా కొనసాగేందుకు ఇటీవలి సుప్రీంకోర్టు తీర్పు మార్గం సుగమం చేసినా, బోర్డులోని ఇతర సభ్యుల నుంచి మద్దతు లేకపోవడంతో ఆ అవకాశం చేజారింది. అయితే తాను బెంగాల్ క్రికెట్ బాడీ ఎన్నికల్లో పోటీ చేయవచ్చని సౌరవ్ గంగూలీ చెప్పాడు.