NTV Telugu Site icon

Tragedy: విషాదం.. కాలకృత్యాలకు వెళ్లిన అక్కాచెల్లెళ్లను పలకరించిన అకాలమృత్యువు

Tragedy

Tragedy

Tragedy: అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం సోమన్నపాలెం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. కాలకృత్యాలకు వెళ్లిన అక్కాచెల్లెళ్లు ఇద్దరు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారు. మృతులు వంతల కావ్యశ్రీ (13), సాహితీ (10)గా పోలీసులు గుర్తించారు. తమ పొలం సమీపంలోని చెరువు వద్ద కాలకృత్యాలు తీర్చుకుని ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడిపోవడంతో చెల్లిని కాపాడే ప్రయత్నంలో ఇద్దరు చెరువులో మునిగిపోయి మృత్యువాత పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు రామారావు శ్రీలక్ష్మి సంఘటన స్థలానికి చేరుకొని ఇద్దరు కుమార్తెలను గ్రామస్తుల సాయంతో చెరువులో నుంచి బయటకు తీసుకురాగా అప్పటికే పెద్ద కుమార్తె మరణించింది.

Read Also: పడుకునే ముందు ఈ ఆకు రసం తాగితే షుగర్ మటుమాయం..

కొన ఊపిరితో ఉన్న రెండో కుమార్తెను కాపాడేందుకు హుటాహుటిన అడ్డతీగల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా.. ఆ చిన్నారి కూడా మార్గమధ్యలో మృత్యువాత పడింది. ఈ ఘటనతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అక్కాచెల్లెళ్ల మృతితో సోమన్నపాలెం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ‌డి.కొత్తూరు పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.