KL Rahul: భారత్, శ్రీలంక మధ్య జరగనున్న రెండు టెస్టుల సిరీస్కు ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. భారత టెస్టు జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ గాయపడటంతో వార్మప్ మ్యాచ్ తొలి రోజుకు దూరమయ్యాడు. ప్రాక్టీస్ సెషన్లో కుడిచేతి రింగ్ ఫింగర్ కు గాయమైనట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధికారికంగా ప్రకటించింది.
బీసీసీఐ వెల్లడించిన వివరాల ప్రకారం.. గురువారం నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్ లో గిల్కు గాయం అయ్యింది. ముందుజాగ్రత్త చర్యగా ఎస్ఎల్సీ XIతో జరుగుతున్న మూడు రోజుల వార్మప్ మ్యాచ్ తొలి రోజు అతడికి విశ్రాంతి ఇచ్చారు. ప్రస్తుతం బీసీసీఐ వైద్య బృందం గిల్ ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పరిశీలిస్తోంది. అయితే గాయం తీవ్రత ఎంత.? అతను ఎప్పటికి పూర్తిగా కోలుకుంటాడు.? అనే విషయాలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు.
కెప్టెన్గా కేఎల్ రాహుల్:
శుభ్మన్ గిల్ అందుబాటులో లేకపోవడంతో సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ వార్మప్ మ్యాచ్లో భారత జట్టుకు కెప్టెన్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. టెస్టు సిరీస్కు ముందు ఈ మ్యాచ్ భారత ఆటగాళ్లకు ఎంతో కీలకం. తుది జట్టు కూర్పు, ఆటగాళ్ల ఫామ్ను అంచనా వేయడానికి ఈ మ్యాచ్ను టీమ్ మేనేజ్మెంట్ ఉపయోగించుకోనుంది. కొలంబోలోని నాన్డిస్క్రిప్ట్స్ క్రికెట్ క్లబ్ గ్రౌండ్ వేదికగా జరుగుతున్న ఈ మూడు రోజుల వార్మప్ మ్యాచ్లో ఎస్ఎల్సీ XI టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ఆగస్టు 7 నుంచి 9 వరకు జరుగుతుంది. టెస్టు సిరీస్కు ముందు భారత జట్టుకు ఇది చివరి ప్రాక్టీస్ మ్యాచ్ కావడంతో ప్రాధాన్యత ఏర్పడింది.
జట్టులో ఆందోళన:
శుభ్మన్ గిల్ గాయం భారత జట్టులో ఆందోళన కలిగిస్తోంది. టెస్టు జట్టు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన గిల్, జట్టుకు కీలక బ్యాటర్ కూడా. అయితే ఇది కేవలం ముందుజాగ్రత్త చర్య మాత్రమేనని, అతని కోలుకునే ప్రక్రియపై వైద్య బృందం నిరంతరం నిఘా ఉంచిందని బీసీసీఐ స్పష్టం చేసింది. ఇప్పుడు అందరి దృష్టి ఒక్క విషయంపైనే ఉంది. శ్రీలంకతో టెస్టు సిరీస్ ప్రారంభమయ్యే నాటికి శుభ్మన్ గిల్ పూర్తిగా కోలుకుని జట్టులోకి తిరిగి వస్తాడా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.

