Shreyas Iyer: బ్రిస్టల్ వేదికగా గురువారం ఇంగ్లాండ్తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్లో భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అద్భుత ఇన్నింగ్స్తో రికార్డులకెక్కాడు. జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసినప్పటికీ.. ఒంటరి పోరాటం చేసిన అయ్యర్ (49 బంతుల్లో 80 నాటౌట్) టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ పేరిట ఉన్న ఓ సరికొత్త రికార్డును సమం చేశాడు. టీ20 క్రికెట్లో ఇంగ్లాండ్పై ఒక భారత కెప్టెన్గా నమోదైన అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును అయ్యర్ అందుకున్నాడు. గతంలో 2021లో అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(కెప్టెన్గా) ఇంగ్లాండ్పై 80 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఇప్పుడు అయ్యర్ అదే స్కోరును సమం చేశాడు. అంతేకాకుండా, ఇంగ్లాండ్తో జరిగిన ఒకే ద్విపాక్షిక టీ20 సిరీస్లో ఒకటి కంటే ఎక్కువ హాఫ్ సెంచరీలు చేసిన మొదటి భారత కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ సరికొత్త చరిత్ర సృష్టించాడు.
ఇంగ్లాండ్పై టీ20ల్లో అత్యధిక స్కోరు చేసిన భారత కెప్టెన్లు:
80 – శ్రేయస్ అయ్యర్ (2026)
80 – విరాట్ కోహ్లీ (2021)
77 – విరాట్ కోహ్లీ (2021)
73 – విరాట్ కోహ్లీ (2021)
68 – శ్రేయస్ అయ్యర్ (2026)
ఇక, నిన్నటి మ్యాచ్లో 5 సిక్సర్లు, 4 ఫోర్లతో చెలరేగిన అయ్యర్.. ఒకవైపు వికెట్లు పడుతున్నా పట్టుదలతో క్రీజులో నిలబడ్డాడు. ఇంగ్లాండ్ పేసర్లు ఎక్స్త్రా బౌన్స్తో భారత టాప్ ఆర్డర్ను మరోసారి దెబ్బతీశారు. జోఫ్రా ఆర్చర్ వేసిన బంతికి యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (15) వరుసగా రెండో ఇన్నింగ్స్లోనూ అవుట్ కాగా, పవర్ప్లేలోనే ఇషాన్ కిషన్ను (4) జోష్ టంగ్ పెవిలియన్కు పంపాడు. ఆ తర్వాత స్పిన్నర్ ఆదిల్ రషీద్ తన మొదటి ఓవర్లోనే అబిషేక్ శర్మను (16) అవుట్ చేయడంతో భారత్ 7 ఓవర్లలోనే 48 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. మరో భారీ బ్యాటింగ్ పతనం ఖాయమనుకున్న తరుణంలో కెప్టెన్ అయ్యర్ ముందుండి నడిపాడు. స్పిన్ను ఎదుర్కోవడానికి ఐదో నంబర్లో ప్రమోషన్ పొందిన శివం దూబేతో (22) కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. వీరిద్దరూ నాలుగో వికెట్కు 53 పరుగులు జోడించి జట్టును కోలుకునేలా చేశారు. ఇన్నింగ్స్ 18వ ఓవర్లో అయ్యర్ గేర్ మార్చి ఆదిల్ రషీద్ బౌలింగ్లో రెండు సిక్సర్లు, ఒక ఫోర్తో ఏకంగా 20 పరుగులు పిండుకున్నాడు. అయితే ఇంగ్లాండ్ బౌలర్లు డెత్ ఓవర్లలో తమ ప్రణాళికలను పక్కాగా అమలు చేశారు. సామ్ కరన్ వేసిన 19వ ఓవర్లో కేవలం 4 పరుగులు మాత్రమే రాగా.. చివరి రెండు ఓవర్లలో ఇంగ్లాండ్ ఒక్క బౌండరీ కూడా ఇవ్వకుండా కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చింది. చివరి ఓవర్ వేసిన జోఫ్రా ఆర్చర్ (2/20) రెండు వికెట్లు తీయడంతో పాటు అక్షర్ పటేల్ను రనౌట్ చేయడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 158 పరుగులకే పరిమితమైంది. ఇక రంగంలోకి ఇంగ్లీష్ జట్టు 9 వికెట్ల తేడాతో ఈజీగా గెలిచింది.

