Site icon NTV Telugu

Shocking Wedding Twist: పెళ్లి మండపంలో ఊహించని ట్విస్ట్.. రూపాయి కట్నం తీసుకొని వివాహం!

Dowry Rejection

Dowry Rejection

Shocking Wedding Twist: ఈ రోజుల్లో ఆడపెళ్లి వారి నుంచి ఎంత ఎక్కువ కట్నం గుంజుదామా అని చూసే మగపెళ్లి వారినే చూస్తుంటాం. కానీ తన కుమారుడికి అత్తింటివారు కట్నంగా ఇచ్చిన రూ.51 లక్షలను వారికే తిరిగి ఇచ్చి, కేవలం రూపాయి కట్నం తీసుకున్న సంచలన ఘటన ఒకటి తాజాగా మధ్యప్రదేశ్‌లోని భిండ్‌లో వెలుగుచూసింది. నిజంగా ఇది ఒక సంచలన వార్త. ఎందుకంటే ఈ రోజుల్లో ఇచ్చిన కట్నం సరిపోలేదంటూ అదనపు కట్నం కోసం వేధింపులు జరుగుతున్న సంఘటనలు ఒక పక్క అయితే, కట్నం సరిపోలేదని వివాహాలను రద్దు చేసుకున్న ఘటనలు మరొక పక్క. ఇలాంటి పరిస్థితిలో కట్నంగా ఇచ్చిన రూ.51 లక్షలను తిరిగి ఆడపెళ్లి వారికే ఇచ్చి, రూపాయిని కట్నం తీసుకోవడం సంచలనంగా మారింది. అసలు ఏం జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: Tiger Tension: నంగునూరు మండలం ఘనపూర్ శివారులో పశువులపై పెద్దపులి దాడి

మధ్యప్రదేశ్‌లోని భిండ్‌లో ఇటీవల జరిగిన ఒక వివాహంలో.. వరుడి తండ్రి కట్నంగా తీసుకున్న రూ.51 లక్షలను వధువు కుటుంబానికి తిరిగి ఇచ్చారు. ఈ సందర్భంగా వరుడి తండ్రి తన కొడుకుకు కేవలం ఒక రూపాయి తీసుకొని వివాహం జరిపించాడు. భిండ్‌లోని ఖిడ్కియా పరిసరాల్లో నివసించే అనోజ్ పాఠక్ కుమారుడు ఆకర్ష్ పాఠక్ వివాహం ఫిబ్రవరి 5న నగరంలోని జగదీష్ మ్యారేజ్ గార్డెన్‌లో జరిపించారు. ఈ సందర్భంగా వధువు కుటుంబం జబల్‌పూర్ నుంచి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి వచ్చింది. వారి సాంప్రదాయ ఆచారం ప్రకారం.. వివాహ విందులో రూ.51 లక్షల కట్నాన్ని పెట్టారు. ఇంతలో ఆ తండ్రీ కొడుకులు ఇద్దరూ ప్రజలను కదిలించేలా, వారందరికి ఒక సానుకూల సందేశాన్ని పంపేలా నిర్ణయం తీసుకున్నారు.

“ఫల్దాన్” వేడుకలో వరుడికి ఆ మొత్తాన్ని అందజేసినప్పుడు అందరి ముందు అనోజ్ పాఠక్ కట్నం తీసుకోవడానికి నిరాకరించాడు. “మేము పెళ్లి చేసుకోవడానికి వచ్చాము, బేరం చేయడానికి కాదు” అని ప్రకటించాడు. అతను ఆ మొత్తాన్ని వధువు కుటుంబానికి తిరిగి ఇచ్చి, ఒక రూపాయి, కొబ్బరికాయను మాత్రమే స్వీకరించి వేడుకను కొనసాగించాడు. ఈ సందర్భంగా వరుడి తండ్రి అనోజ్ పాఠక్ మాట్లాడుతూ..”మా కోడలు మాకు కూతురుగా కావాలి. సంబంధాలు డబ్బు మీద కాదు, ఆప్యాయత, విలువల మీద నిర్మించాలి. కట్నం తీసుకోవడం మా విలువలకు విరుద్ధం” అని అన్నారు. “నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. నా కొడుకుల వివాహాలకు, కోడళ్లని కూతురిగా తీసుకురావాలి అనుకున్నాను. మంచి, సంస్కారవంతులైన అమ్మాయిల కుటుంబాలు పెళ్లి కోసం మమ్మల్ని సంప్రదించడానికి సంకోచించాయి. కాబట్టి నా కొడుకు వివాహానికి డబ్బు తీసుకోకూడదని నిర్ణయించుకున్నాను” అని వివరించారు. వధువు కుటుంబానికి నేను డబ్బు తిరిగి ఇచ్చినప్పుడు, వాళ్ల తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు. నేను కోపంతో అలా చేశానని వాళ్లు అనుకున్నారు, కానీ ఇతర బంధువులు తనతో మాట్లాడి వివరించినప్పుడు, అప్పుడు వాళ్లు అర్థం చేసుకున్నారని చెప్పారు. ఆయన నిర్ణయం అక్కడున్న ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసింది. ప్రజలు ఆయన నిర్ణయాన్ని ప్రశంసించారు. నేటికీ దేశంలోని అనేక ప్రాంతాల్లో వరకట్నం కూతుళ్ల కుటుంబాలపై భారంగా మారిందని, అప్పులు, అవమానాలు, సామాజిక ఒత్తిడి కారణంగా వారి జీవితాలు కష్టతరం అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ ఘటన ప్రజలందరికి ఒక సానుకూల సందేశం పంపుతుంది.

READ ALSO: T20 World Cup 2026: రోహిత్-కోహ్లీ లేని లోటును తీర్చేస్తూ.. అరుదైన మైలురాయిని సృష్టించిన భారత్!

Exit mobile version