Shoaib Akhtar: 2026 టీ20 ప్రపంచకప్లో భారత జట్టు అద్భుత విజయంపై పాకిస్థాన్ మాజీ ప్లేయర్ షోయబ్ అక్తర్ ప్రశంసల వర్షం కురిపించాడు. టీమిండియా అద్భుత ప్రదర్శనను కొనియాడుతూనే, తన సొంత దేశపు క్రికెట్ బోర్డు (PCB) పరువు తీశాడు. భారత యువ జట్టు ప్రపంచ ఛాంపియన్గా నిలవడంపై షోయబ్ అక్తర్ స్పందిస్తూ, ఇది కేవలం ఆటగాళ్ల విజయం మాత్రమే కాదని, భారత క్రికెట్ వ్యవస్థ సాధించిన విజయమని అభివర్ణించారు. మెరిట్ ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడంలో బీసీసీఐ (BCCI) అనుసరిస్తున్న విధానమే భారత్ను విశ్వవిజేతగా నిలిపిందని కొనియాడాడు.
READ ALSO: Rajya Sabha Members : తెలంగాణ నుంచి రాజ్యసభకు సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి.. ఏకగ్రీవ ఎన్నిక పూర్తి..!
సంజు శామ్సన్ ప్రదర్శనపై ప్రశంసలు..
ముఖ్యంగా ఈ టోర్నీలో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచిన సంజు శామ్సన్ను అక్తర్ ప్రత్యేకంగా అభినందించారు. “అవకాశం ఆలస్యంగా వచ్చినా, కేవలం 4-5 మ్యాచ్ల్లోనే అద్భుత ప్రదర్శన చేసి టోర్నీలోనే అత్యుత్తమ ఆటగాడిగా నిలవడం సామాన్యం కాదు. సంజు ఈ అవార్డుకు 100 శాతం అర్హుడు” అని కొనియాడాడు. ఇషాన్ కిషన్ తన ప్రతిభను మరోసారి నిరూపించుకున్నాడని, ఫైనల్లో అభిషేక్ శర్మ ఆడిన మెరుపు ఇన్నింగ్స్ జట్టును గెలిపించిందని అక్తర్ ప్రశంసించాడు. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకున్న సాహసోపేత నిర్ణయాలే ఈ విజయానికి పునాది అని అక్తర్ విశ్లేషించాడు. “సీనియర్లను పక్కన పెట్టి యువ ఆటగాళ్లపై నమ్మకం ఉంచడం ఒక సాహసం. ఆ నమ్మకాన్ని గంభీర్ అండ్ కో నిలబెట్టుకుంది. టీమ్ మేనేజ్మెంట్ తీసుకున్న ధైర్యమైన నిర్ణయాలే భారత్కు ట్రోఫీని అందించాయి” అని అన్నాడు.
పీసీబీకి చురకలు..
ఇదే క్రమంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB)పై అక్తర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. “సరైన ప్రతిభను గుర్తించడంలో, యువతకు అవకాశాలివ్వడంలో బీసీసీఐని చూసి పీసీబీ చాలా నేర్చుకోవాలి. మెరిట్ పక్కన పెట్టి నిర్ణయాలు తీసుకుంటే ఫలితాలు ఎలా ఉంటాయో పాకిస్థాన్ క్రికెట్ను చూస్తే అర్థమవుతుంది” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
READ ALSO: Sanju Samson: ‘భార్యకు ఎమోషనల్ మెసేజ్’.. వరల్డ్ కప్ హీరో సంజు మనసులో మాట ఇదే!