Shehbaz Sharif: ఇజ్జత్ తీసుకోవడంలో పాకిస్థాన్ను మంచిన దేశం మరొకటి లేదు. తాజాగా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన ఓ మిస్టెక్ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఇరాన్ సంక్షోభం విషయంలో పాక్ వ్యవహరిస్తున్న తీరుపై అనేక అనుమానాలకు ఈ పోస్ట్ తావిచ్చింది. అసలు విషయం ఏమిటంటే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఉద్దేశించి పాకిస్థాన్ ప్రధాని షరీఫ్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఒక విజ్ఞప్తి చేశారు. ఇరాన్పై విధించిన గడువును మరో రెండు వారాల పాటు పొడిగించాలని, దౌత్యపరమైన చర్చలకు అవకాశం ఉంటుందని ట్వీట్లో కోరారు. ఇరాన్ సైతం ‘స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్’ను తిరిగి తెరవాలని షరీఫ్ సూచించారు.
READ MORE: NTRNeel : పుకార్లను కొట్టిపారేసిన మేకర్స్.. ‘డ్రాగన్’ షూటింగ్పై అఫీషియల్ ప్రకటన
ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ.. ఈ పోస్ట్ పెట్టిన కొన్ని నిమిషాలకే దాన్ని ఎడిట్ చేశారు. దీన్ని సోషల్ మీడియా యూజర్లు గమనించారు. ఆ ఎడిట్ హిస్టరీని పరిశీలిస్తే షరీఫ్ అడ్డంగా దొరికిపోయారనే చర్చ మొదలైంది. ఎందుకంటే, ఆ పోస్ట్ మొదటి వెర్షన్లో “Draft – Pakistan’s PM Message on X” (డ్రాఫ్ట్ – ఎక్స్లో పాక్ ప్రధాని సందేశం) అని రాసి ఉంది. ఇది చూసిన సోషల్ మీడియా యూజర్లు పాకిస్థాన్ దౌత్యంపై సెటైర్లు వేస్తున్నారు. ఆ సందేశం పాక్ సొంతంగా రాసుకున్నది కాదని, ఎవరో పంపిన స్క్రిప్ట్ను షరీఫ్ అలాగే కాపీ-పేస్ట్ చేశారని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా వైట్ హౌస్ పంపిన ఇన్స్ట్రక్షన్స్ను తొలగించడం మర్చిపోయి ప్రధాని అలాగే పోస్ట్ చేశారంటూ స్క్రీన్ షాట్లు వైరల్ అవుతున్నాయి. దీంతో “పాకిస్థాన్ను డొనాల్డ్ ట్రంప్ నియంత్రిస్తున్నారా?” అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పాక్ ప్రధాని తనంతట తానుగా సందేశాలు ఇవ్వడం లేదని, బయటి శక్తుల ప్రభావంతోనే ఈ పోస్టులు వస్తున్నాయని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ఇరాన్-అమెరికా మధ్య పాకిస్థాన్ మధ్యవర్తిగా వ్యవహరిస్తూ, ఇరు దేశాల ప్రతిపాదనలను అటుఇటు మారుస్తోంది. “దౌత్య ప్రయత్నాలు బలంగా, శక్తివంతంగా సాగుతున్నాయి, యుద్ధానికి ముగింపు పలకాలంటే గడువు పొడిగించడం అవసరం” అని షరీఫ్ తన సందేశంలో పేర్కొన్నప్పటికీ, ఈ ‘డ్రాఫ్ట్’ వివాదం ఆయన అసలు ఉద్దేశాన్నే పక్కదారి పట్టించింది.
