Shashi Tharoor: బ్రిటిష్ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ భారీ విజయాన్ని నమోదు చేసింది. హౌజ్ ఆఫ్ కామన్స్లో 650 స్థానాలకు ఏకంగా 412 సీట్లను ఆ పార్టీ అభ్యర్థులు గెలిచారు. దీనిని ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశి థరూర్ భారతీయ జనతా పార్టీపై విమర్శలు గుప్పించారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా బీజేపీ ఇచ్చిన నినాదం.. మొత్తానికి ఇప్పడు నిజమైందంటూ ఆయన ఎద్దేవా చేశారు. బీజేపీ ‘అబ్ కీ బార్, 400 పార్’సాధ్యమైందన్నారు. కానీ, అది భారతదేశంలో కాదు.. మరో దేశంలో సాధ్యం అయిందని ట్విట్టర్ వేదికగా బీజేపీపై శశి థరూర్ సెటైర్ వేశారు.
Read Also: Tamil Nadu: తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్స్ట్రాంగ్ హత్య కేసులో 8 మంది అరెస్ట్
అలాగే, లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 370 సీట్లు, కూటమిగా 400 సీట్లు విజయంచడమే లక్ష్యంగా ప్రచారం నిర్వహించింది. తాము తప్పకుండా 400 స్థానాల్లో విజయం సాధిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ సహా బీజేపీ నాయకులు ఎన్నికల ప్రచారంలో ‘అబ్ కీ బార్ 400 పార్’ అనే నినాదాన్ని చెప్పుకొచ్చారు. అయితే వారి అంచనాలకు భిన్నంగా బీజేపీ సొంతంగా 240 సీట్లు, ఎన్డీయే కూటమితో కలిపి 293 స్థానాలకే పరిమితమైంది. మిత్రపక్షాల సహాయంతో మరోసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇక, కాంగ్రెస్ పార్టీ సొంతంగా 99 స్థానాల్లో గెలవగా.. ఇండియా కూటమి 234 స్థానాలను కైవసం చేసుకుంది. కాగా, బ్రిటన్లో తాజాగా అధికారాన్ని చేపట్టిన లేబర్ పార్టీ 2019లో 211 సీట్లలో విజయం సాధించగా.. ఈసారి 412 సీట్లను గెలుచుకొని సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేసింది.