Shabad Murders: రాజ్‌కుమార్ బెయిల్ ఆర్డర్‌లో సంచలన విషయాలు.. పోక్సో కేసులో ముందస్తు బెయిల్.?

Shabad Murder

Shabad Murder

Shabad Murders: షాబాద్‌లో సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసులో ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్‌కు సంబంధించిన పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం పరారీలో ఉన్న రాజ్‌కుమార్‌కు జూన్ 12న పోక్సో కేసులో కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో అతడు కోర్టులో చేసిన వాదనలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. బెయిల్ విచారణ సందర్భంగా.. తనపై నమోదైన పోక్సో కేసు తప్పుడు కేసు అని రాజ్‌కుమార్ కోర్టుకు తెలిపినట్లు సమాచారం. బాధిత బాలిక తండ్రి తన వద్ద అప్పు చేశాడని, ఆ డబ్బులు తిరిగి అడిగినందుకే తనపై కేసు పెట్టారని వాదించాడు. ఫిర్యాదు చేసిన రోజు తాను అక్కడే లేనని, ఆ సమయంలో భార్యతో కలిసి ఆస్పత్రికి వెళ్లినట్లు కోర్టులో తెలిపాడు.

దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం.. మైనర్ బాలికకు సంబంధించిన కేసు నమోదైన తర్వాత రాజ్‌కుమార్ కుటుంబంలో విభేదాలు మరింత పెరిగాయి. ఈ వ్యవహారం తర్వాత అతడి భార్య సరిత విడాకులు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. ఇదే విషయంపై రాజ్‌కుమార్ తీవ్ర ఆగ్రహానికి గురై, పలుమార్లు సరితను చంపేస్తానని బెదిరించినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. పోలీసుల దర్యాప్తు ప్రకారం.. హత్యలకు ముందు రాజ్‌కుమార్ సాధారణంగానే వ్యవహరించినట్లు గుర్తించారు. ఘటనకు కొన్ని గంటల ముందు తన కుమారుడితో కలిసి బయటకు వెళ్లి ఆడించడంతో పాటు హెయిర్ కటింగ్ కూడా చేయించినట్లు సమాచారం. అదే రోజు ఉత్సాహంగా ఇంటికి వెళ్లిన తర్వాత కుటుంబ సభ్యులపై దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

రాజ్‌కుమార్ ఆన్‌లైన్ బెట్టింగ్‌లో భారీగా డబ్బు పోగొట్టుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. అప్పులు తీర్చేందుకు ఒక ఎకరం భూమిని అమ్మి సుమారు రూ.1.50 కోట్ల అప్పులు చెల్లించినట్లు పోలీసులు గుర్తించారు. ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు పోక్సో కేసు, భార్య విడాకుల ఒత్తిడి కలిసి అతడిని ఈ దారుణానికి పురికొల్పి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కుటుంబ కలహాలు సద్దుమణిగేలా రాజ్‌కుమార్ తండ్రి పలుమార్లు రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించినా పరిస్థితులు మారకపోవడంతో రాజ్‌కుమార్ తీవ్ర నిర్ణయం తీసుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్ పరారీలో ఉండగా.. అతడి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు భారీగా గాలింపు కొనసాగిస్తున్నాయి. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తూ మరిన్ని ఆధారాలను సేకరిస్తున్నారు.