Sathankulam Case: సాతన్కుళం లాకప్ డేత్ కేసులో మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ సంచలన తీర్పు ఇచ్చింది. తండ్రి కొడుకులను లాకప్లో చిత్రహింసలు పెట్టి చంపిన కేసులో 9 మంది పోలీస్ అధికారులకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. 2020లో తూత్తుకుడి జిల్లాలోని సాతన్కుళం వద్ద, ఇద్దరు వ్యాపారులు పి. జయరాజ్ అతని కుమారుడు బెనిక్స్లు పోలీసు కస్టడీలో చిత్రహింసలకు గురై మరణించిన ఘటనలో దోషులుగా తేలిన తొమ్మిది మంది పోలీసులకు మదురై మొదటి అదనపు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి మరణశిక్ష విధించారు.
దోషులుగా తేలిన ఆ తొమ్మిది మందిలో అప్పటి ఇన్స్పెక్టర్ ఎస్. శ్రీధర్, సబ్-ఇన్స్పెక్టర్లు పి. రఘు గణేష్ మరియు కె. బాలకృష్ణన్, హెడ్ కానిస్టేబుళ్లు ఎస్. మురుగన్ మరియు ఎ. సమిదురై, అలాగే కానిస్టేబుళ్లు ఎం. ముత్తురాజా, ఎస్. వెయిల్ ముత్తు, ఎస్. చెల్లదురై, ఎక్స్. థామస్ ఫ్రాన్సిస్ ఉన్నారు.
కేసు వివరాలు ఇవే:
2020 జూన్ 19న జయరాజ్ తన కుమారుడి మొబైల్ షాప్లో ఉన్నప్పుడు, కోవిడ్ -19 కర్ఫ్యూ వేళలు దాటినా కూడా షాప్ తెరిచి ఉంచారనే ఆరోపణలతో వీరిద్దరిని పోలీసులు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. బెనిక్స్ స్టేషన్కు వెళ్లి తన తండ్రిని విడుదల చేయాలని కోరినప్పుడు నిందితులైన పోలీసులు బెనిక్స్ కళ్ల ముందే జయరాజ్ను తిట్టారు. దీంతో బెనిక్స్, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఘటన తర్వాత తండ్రీ కొడుకుల్ని పోలీసులు రాత్రంతా స్టేషన్లో ఉంచి తీవ్రంగా చిత్రహింసలకు గురి చేశారు.
ఆ తర్వాత సాతన్కుళం జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ వారికి జ్యూడీషియల్ కస్టడీకి అప్పగించారు. వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోకుండానే, సరైన వైద్య చికత్స అందించకుండానే మరుసటి రోజు వారిని కోవిల్ పట్టి సబ్ జైలులో బంధించారు. వీరి పరిస్తితి విషమించి 2020 జూన్ 22న కోవిల్పట్టి ప్రభుత్వ ఆసుపత్రిలో బెనిక్స్ మరణించగా, ఒక రోజు తర్వాత జయరాజ్ కన్నుమూశారు.
వీరిద్దరి మరణాలపై కోవిల్పట్టి తూర్పు పోలీస్ స్టేషన్లో 2 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఈ కేసును మొదట సీబీసీఐడీ విచారించగా, ఆ తర్వాత సీబీఐ దర్యాప్తు చేసింది. నిందితుల్లో ఒకరైన ఎస్ఎస్ఐ పాల్దురై ఆగస్టు 2020లో కోవిడ్-19 కారణంగా మరణించారు. మిగిలిన 9 మంది పోలీసులపై సీబీఐ సెప్టెంబర్ 25,2020న ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసు మార్చి 10, 2021న మదురైలోని 1వ అదనపు జిల్లా మరియు సెషన్స్ కోర్టులో విచారణకు వచ్చింది. విచారణ జరుగుతున్న సమయంలోనే సీబీఐ ఒక అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేుసింది.
మృతులు దుకాణాన్ని అనుమతించదగిన సమయానికి మించి తెరిచి ఉంచలేదని, వారిపై తప్పుడు కేసు బనాయించారని రెండు ఛార్జిషీట్లలోనూ వెల్లడైంది. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన మహిళా హెడ్ కానిస్టేబుల్ వాంగ్మూలం ప్రకారం, వీరిద్దరిని రాత్రంతా చిత్రహింసలు పెట్టినట్లు తేలింది. పోలీస్ స్టేషన్ వీరిద్దరికి తీవ్రగాయాలై, వీరి రక్తం నేలపై పడితే, వారి దుస్తులతోనే శుభ్రం చేసుకోవాలని పోలీసులు ఆదేశించినట్లు తేలింది.
పోస్ట్మార్టం నివేదికలో బెనిక్ శరీరంపై 13 బాహ్య గాయాలు, జయరాజ్ శరీరంపై 17 గాయాలు ఉన్నట్లు తేలింది. వీటి వల్లే ఇద్దరు మరణించినట్లు వెల్లడైంది. నాలుగేళ్లకు పైగా సాగిన సుదీర్ఘ విచారణ అనంతరం, మార్చి 23న కోర్టు తొమ్మిది మంది పోలీసులను దోషులుగా నిర్ధారించింది. కేసును విచారించిన కోర్టు, ఇది అత్యంత అరుదైన కేసుల పరిధిలోకి వస్తుందని, అందుకే మరణశిక్ష విధించాలని సీబీఐ ప్రత్యేక ప్రాసిక్యూటర్ వాదించారు.
బెనిక్స్ గొడవ చేయడం వల్లే పోలీసులు కొట్టారని, దీంట్లో ముందస్తు ప్రణాళిక లేదని నిందితుల తరుఫు న్యాయవాది వాదించారు. ఈ కేసులో దోషుల సంస్కరణపై దృష్టిసారించి, తక్కువ శిక్ష విధించాలని కోరారు. కానీ, రాత్రంతా ఇద్దరిపై దారుణంగా దాడి చేయడం వల్లే దోషులు మరణించినట్లు కోర్టు గ్రహించింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు నిందితులకు మరణశిక్ష విధించింది.