జనగామ జిల్లా లింగాల ఘణపురం మండలం నెల్లుట్ల గ్రామ సర్పంచ్ దంపతులు చిట్ల స్వరూపారాణి భూపాల్ రెడ్డికి అద్భుతమైన అవకాశం వచ్చింది. నెల్లుట్ల గ్రామపంచాయతీ కీర్తి పతాకాన్ని ఢిల్లీ గడ్డపై రెపరెపలాడించారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను నీటి సమృద్ధి విభాగంలో జాతీయ పురస్కారాన్ని అందుకున్న తొమ్మిది నెలల్లోనే తాజాగా రాష్ట్రపతి ఎట్ హోంకు హాజరయ్యే మరో అవకాశం వారికి దక్కింది. ఈనెల 26వ తేదీన గణతంత్ర వేడుకల సందర్భంగా నిర్వహించే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎట్ హోం వేడుకలకు రావాలంటూ నెల్లుట్ల సర్పంచ్ దంపతులకు ఆహ్వానం అందింది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని కేంద్ర పంచాయితీరాజ్ విభాగం నుంచి తెలంగాణ పంచాయతీరాజ్ కమిషనర్ కు ఆదేశాలు పంపించారు.
Read Also: Ayodhya Ram Mandir : రాముడు వచ్చే వేళా విశేషం.. ఉత్తర ప్రదేశ్కు కాసుల వర్షం
దీంతో యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేపట్టాల్సిందిగా జిల్లా పంచాయితీ అధికారికి తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే, గత ఏడాది ఏప్రిల్ 17వ తేదీన నిర్వహించిన కార్యక్రమంలో సర్పంచ్ స్వరూపారాణి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని తీసుకున్నారు. ఈ క్రమంలోనే సర్పంచ్ స్వరూపారాణికి ఎట్ హోమ్కు రాష్ట్రపతి ఆఫీస్ నుంచి ఆహ్వానం అందింది. దేశ వ్యాప్తంగా కేవలం ఎనిమిది మంది సర్పంచ్లకే ఈ అవకాశం దక్కగా.. అందులో తెలంగాణ రాష్ట్రం నుంచి నెల్లుట్ల సర్పంచ్కు చోటు దక్కడం విశేషం.