Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..

Saidabad

Saidabad

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చేపట్టిన కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులలో భాగమైన సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తయ్యాయని రవాణా, హైదరాబాద్ ఇన్-ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మంత్రి అజారుద్దీన్‌తో కలిసి నూతనంగా రూపుదిద్దుకున్న సైదాబాద్ స్టీల్ బ్రిడ్జితో పాటు తుది దశకు చేరుకున్న మూసారాంబాగ్ బ్రిడ్జి పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా, కాలేరు వెంకటేష్, ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తదితర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సుమారు రూ.680 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఆధునిక స్టీల్ బ్రిడ్జి చంచల్‌గూడ జైలు ప్రాంగణం నుంచి ఓవైసీ ఆస్పత్రి వరకు, అలాగే మరోవైపు చంపాపేట వైపు సులభంగా వెళ్లేలా మెరుగైన కనెక్టివిటీని అందిస్తుంది. అతిత్వరలోనే ఈ వంతెనను రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించి ప్రజలకు అంకితం చేయనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే సైదాబాద్, సంతోష్‌నగర్, చంచల్‌గూడ, చంపాపేట తదితర ప్రాంతాల ప్రజలకు సుదీర్ఘకాలంగా వేధిస్తున్న ట్రాఫిక్ కష్టాల నుంచి ఉపశమనం లభించడమే కాకుండా ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది.

అలాగే మూసారాంబాగ్ వద్ద నిర్మిస్తున్న వంతెన పనులు సైతం చివరి ఘట్టానికి చేరుకున్నాయని, రాకపోకలకు వీలుగా అప్రోచ్ రోడ్ల విస్తరణను వేగవంతం చేశామని తెలిపారు. నగరంలో నానాటికీ పెరుగుతున్న జనాభా, వాహనాల రద్దీకి అనుగుణంగా కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చేపట్టిన బ్రిడ్జి పనులతో పాటు పెండింగ్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారని, ప్రజా రవాణాను మరింత మెరుగుపరచడమే ప్రభుత్వ ప్రాధాన్యమని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.