Sai Krishna Lockup Death Case: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సంచలనం సృష్టించిన సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు విచారణలో గురువారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. కేసును సీబీఐకి అప్పగించాలని దాఖలైన పిటిషన్ ఉపసంహరణ అంశంపై సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ను ధర్మాసనం విచారించింది.
విచారణ సందర్భంగా.. తనకు తెలియకుండా సీబీఐ విచారణ కోసం దాఖలైన పిటిషన్ను న్యాయవాది రిత్విక ఉపసంహరించుకున్నారని విజయలక్ష్మి కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో ధర్మాసనం ఆమెను “మీ తరఫున ఏ న్యాయవాది వాదించాలి?” అని ప్రశ్నించింది. అయితే, ఆశ్చర్యకరంగా నిన్న ఆరోపణలు చేసిన అదే న్యాయవాది రిత్వికనే తన తరఫున న్యాయవాదిగా కొనసాగించాలని విజయలక్ష్మి కోర్టును కోరారు. దీంతో ఈ వ్యవహారంలో కొత్త మలుపు చోటుచేసుకుంది.
ఇక హెబియస్ కార్పస్ పిటిషన్పై వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నారా అని హైకోర్టు ప్రశ్నించగా.. ప్రభుత్వం తరఫు న్యాయవాది విచారణకు రెండు వారాల సమయం ఇవ్వాలని ధర్మాసనాన్ని కోరారు. అయితే, అంత సమయం ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేసిన హైకోర్టు, కేసు తదుపరి విచారణను 10 రోజులకు వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

