Sai Krishna Death Case: సాయికృష్ణ డెత్ కేసులో కీలక మలుపు.. లొంగిపోయిన హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని.!

Sai Krishna Death

Sai Krishna Death

Sai Krishna Death Case: సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అరెస్టైన సీఐ నాగరాజుకు సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని కాసేపటి క్రితం విజయవాడ సూర్యారావుపేటలోని సౌత్ ఏసీపీ మానస కార్యాలయంలో లొంగిపోయారు. సీఐ నాగరాజు అరెస్టు అనంతరం వారం రోజులుగా అజ్ఞాతంలో ఉన్న అశోక్, నానిపై ఇప్పటికే నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు సస్పెన్షన్ వేటు వేశారు. వీరిద్దరూ విధులకు గైర్హాజరుకావడంతో పాటు కేసు విచారణకు అందుబాటులో లేకపోవడంతో ప్రత్యేక బృందాలు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి.

సిట్ నిర్వహించిన ప్రాథమిక విచారణలో సీఐ నాగరాజుకు ఈ ఘటనలో అశోక్, నాని సహకరించినట్లు తేలినట్లు సమాచారం. కస్టోడియల్ డెత్ అనంతరం మృతదేహాన్ని మాయం చేయడంలో కూడా వీరిద్దరూ కీలక పాత్ర పోషించినట్లు సిట్ తన రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. ఈ నేపథ్యంలో వారిని నిందితులుగా చేర్చుతూ ఇప్పటికే మెమో దాఖలు చేసినట్లు తెలుస్తోంది.

వీరిద్దరిని పట్టుకునేందుకు సిట్ అధికారులు హైదరాబాద్, బెంగళూరు నగరాలకు ప్రత్యేక బృందాలను పంపారు. కుటుంబ సభ్యులను కూడా పలుమార్లు విచారించారు. ఈ క్రమంలోనే అశోక్, నాని స్వచ్ఛందంగా లొంగిపోవడం కేసు విచారణలో కీలక మలుపుగా భావిస్తున్నారు. లొంగిపోయిన అనంతరం సౌత్ ఏసీపీ మానస ఇద్దరినీ ప్రాథమికంగా విచారించి, తదుపరి సిట్ కార్యాలయానికి తరలించారు. ప్రస్తుతం సిట్ అధికారులు వారిని సుదీర్ఘంగా విచారించేందుకు సిద్ధమవుతున్నారు. సాయికృష్ణ మృతదేహం ఏమైంది.? కస్టోడియల్ డెత్ అనంతరం ఏం జరిగిందనే.. అంశాలపై ఇప్పటికీ స్పష్టత రాకపోవడంతో వీరి విచారణ ద్వారా కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. ఈ కేసుకు సంబంధించి మరో కానిస్టేబుల్ మురళీకృష్ణతో పాటు బాబూరావును కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. కేసులో ప్రమేయం ఉన్న ప్రతి వ్యక్తి నుంచి వివరాలు సేకరించే ప్రక్రియ కొనసాగుతోంది. హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని లొంగిపోవడంతో సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు దర్యాప్తు మరింత వేగం పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మృతదేహం అదృశ్యం, ఘటన అనంతర పరిణామాలపై కీలక సమాచారం బయటపడే అవకాశం ఉందని సిట్ అధికారులు భావిస్తున్నారు.