Sachin Pilot: తిరగబడ్డ ఎమ్మెల్యేలందరినీ శిక్షించాలి.. సచిన్‌ పైలట్‌ సంచలన వ్యాఖ్యలు

Sachin Pilot

Sachin Pilot

Sachin Pilot: రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌, సచిన్‌ పైలట్‌ వర్గాల మధ్య వైరం కొనసాగుతూనే ఉంది. ఆ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ మరోసారి తన వ్యతిరేక గళం వినిపించారు. రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీలో నెలకొన్న అంతర్గత అస్థిరతకు తెరదించాలని కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కోరారు. పార్టీలో అనిశ్చితికి తెరదించేందుకు ఇది సరైన సమయమని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నికల సందర్భంగా పార్టీ అధిష్ఠానంపై తిరగబడ్డ గెహ్లాట్‌ వర్గ ఎమ్మెల్యేలను శిక్షించాలని హైకమాండ్‌ను కోరారు.

Gujarat Tragedy: మోర్బీ వంతెన దుర్ఘటన ‘యాక్ట్ ఆఫ్ గాడ్‌’.. ఒరేవా మేనేజర్‌ వాదనలు

మరోవైపు మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌పై ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించడంపై వ్యంగాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ పార్టీ మాజీ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌తో పోలుస్తూ విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రిని ప్రధాని మోడీని పొగడడం ఆసక్తికరమని.. దీనిని తేలిగ్గా తీసుకోకూడదన్నారు. గతంలో పార్లమెంట్ వేదికగా గులాం నబీ ఆజాద్‌ను మోడీ ప్రశంసించిన అనంతరం ఏం జరిగిందో తెలుసన్నారు. రాజస్థాన్‌లో పార్టీని ధిక్కరించిన వారిపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు సూచించారు. రాజస్థాన్‌లో నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితికి ముగింపు పలకాలన్నారు. రాజస్థాన్‌లో పరిస్థితిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని పార్టీ పరిశీలకులు కేసీ వేణుగోపాల్‌ చెప్పినట్లు పైలట్‌ వెల్లడించారు.