రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరోసారి తీవ్రంగా నడుస్తోంది. గత నాలుగేళ్ల నుంచి యుద్ధం జరుగుతోంది. ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. ఇరువైపులా ఆస్తులు ధ్వంసమయ్యాయి. తాజాగా మరోసారి తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా దాడులు చేసినట్లు సమాచారం. ఈ దాడుల్లో ఇప్పటివరకు 27 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు సుమారు 50 నివాస భవనాలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.
కీవ్ పశ్చిమ శివార్లలో రష్యాకు చెందిన డ్రోన్ ఓ గిడ్డంగిని ఢీకొట్టడంతో భారీ పేలుళ్లు, అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 27 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు సుమారు 50 నివాస భవనాలు దెబ్బతిన్నట్లు సమాచారం. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనతో కీవ్ పశ్చిమ శివారు ప్రాంతాల్లో భారీగా నల్లటి పొగ కమ్ముకుంది. గిడ్డంగిలో ఇంకా మంటలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కీవ్ ప్రాంత గవర్నర్ తైమూర్ ట్కాచెంకో వెల్లడించారు.
గిడ్డంగిలో పేలుడు పదార్థాలు?
రష్యా డ్రోన్ దాడికి గురైన గిడ్డంగిలో ‘పేలుడు పదార్థాలు’ నిల్వ చేసినట్లు ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్లు అనుమానిస్తున్నారు. అయితే అక్కడ ఎలాంటి వస్తువులను నిల్వ చేశారనే విషయాన్ని అధికారులు వెల్లడించలేదు. ఈ ఘటనపై ఉక్రెయిన్ అధికారులు క్రిమినల్ నిర్లక్ష్యంపై దర్యాప్తు ప్రారంభించారు.
ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయం ప్రకారం.. ఆగస్టు 28న రాత్రి సుమారు 8.10 గంటలకు ఓ మానవరహిత వైమానిక వాహనం (డ్రోన్) కీవ్ పశ్చిమ శివార్లలోని మైలా పట్టణంలోని ఓ సంస్థ ప్రాంగణంపై పడింది లేదా ఢీకొట్టింది. అనంతరం అక్కడ భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో పాటు వరుస పేలుళ్లు సంభవించాయి.
సంస్థపై దర్యాప్తు
పేలుడు పదార్థాలు, ఇతర సామగ్రిని అక్కడ నిల్వ చేయడానికి సంస్థకు అవసరమైన అనుమతులు ఉన్నాయా? నిబంధనలకు అనుగుణంగా వాటిని నిల్వ చేశారా? అనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నట్లు ప్రాసిక్యూటర్ కార్యాలయం తెలిపింది. సంస్థ పేరును మాత్రం వెల్లడించలేదు. మృతుల్లో డిమిత్రివ్స్కా గ్రామ మేయర్ తారస్ డిడిచ్ కూడా ఉన్నట్లు కీవ్ ప్రాంత గవర్నర్ తెలిపారు.
గత ఘటన నుంచి పాఠం నేర్చుకోలేదా?
జూలైలో కీవ్ సమీపంలోని విష్నేవ్లోని ఆయుధాల గిడ్డంగిపై జరిగిన ప్రాణాంతక దాడిని ఉక్రెయిన్ ప్రధాని సెర్గీ కొరెట్స్కీ గుర్తుచేశారు. ఆ ఘటనలోనూ భారీ నష్టం సంభవించగా.. ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థ భద్రతా ప్రమాణాలను పాటించలేదని దర్యాప్తులో వెల్లడైనట్లు తెలిపారు.
పెరుగుతున్న రష్యా-ఉక్రెయిన్ దాడులు
ఇటీవలి నెలల్లో రష్యా, ఉక్రెయిన్లు పరస్పరం దీర్ఘశ్రేణి క్షిపణులు, డ్రోన్లతో దాడులను మరింత తీవ్రతరం చేశాయి. ఈ దాడుల కారణంగా భారీగా అగ్నిప్రమాదాలు సంభవించడంతో పాటు పౌరుల ప్రాణనష్టం కూడా పెరుగుతోంది. తాజాగా కీవ్పై జరిగిన దాడి యుద్ధ తీవ్రతను మరోసారి స్పష్టం చేసింది.

