Cyber Investment Fraud: నేరస్తులు పంథా మార్చారు. గతంలోలాగా ఇళ్లను కొల్లగొట్టడం కాకుండా కొత్తగా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. గిప్టులు, లక్కీ డ్రా, ఓటీపీల పేరుతో ప్రజలను మోసగిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా రూ.854 కోట్ల సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. బెంగళూర్ కేంద్రంగా సైబర్ ఇన్వెస్ట్మెంట్ మోసాన్ని పోలీసులు ఛేదించారు. పెట్టుబడి పెడితే రోజుకు రూ. 1000 నుంచి రూ. 5000 వరకు లాభం పొందొచ్చని చెబుతూ దేశంలో వేలాది మందిని మోసం చేశారు.
నిందితుల ముఠా వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా బాధితులను ఆకర్షించినట్లు పోలీసులు తెలిపారు. ప్రారంభంలో రోజుకు రూ. 1000 నుంచి రూ. 5000 వరకు లాభం పొందుతారని, దీనికి రూ. 1000 నుంచి రూ. 10,000 వరకు చిన్న మొత్తాలను పెట్టుబడిగా పెట్టమని నిందితులు చెప్పారని పోలీసు అధికారులు వెల్లడించారు. వేలాది మంది బాధితులు రూ. లక్ష నుంచి రూ. 10 లక్షల వరకు అంతకన్నా ఎక్కువ పెట్టుబడి పెట్టారని పోలీసులు వెల్లడించారు.
Read Also: Rahul Gandhi: ఒకవైపు మహాత్మా గాంధీ, మరో వైపు గాడ్సే..ఎంపీ ప్రచారంలో రాహుల్ గాంధీ..
బాధితులు పెట్టుబడి పెట్టిన సొమ్మును ఆన్లైన్ చెల్లింపుల ద్వారా వివిధ బ్యాంకు ఖాతాల్లో జమ చేశారని, అయితే పెట్టుబడి ప్రక్రియ పూర్తయిన తర్వాత, బాధితులు ఆ మొత్తాన్ని విత్ డ్రా చేసుకునేందుకు ప్రయత్నించినప్పుడు ఎలాంటి డబ్బు వాపస్ రాలేదని సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. నిందితులు ఈ డబ్బును మనీలాండరింగ్ కి సంబంధించిన మ్యూల్ ఖాతాలకు మళ్లించినట్లు తెలిసింది. క్రిప్టో, పేమెంట్ గేట్ వే, గేమింగ్ యాప్ ల ద్వారా రూ. 854 కోట్లను మళ్లించారు.
ఈ కేసులో ఇప్పటి వరకు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి రూ. 5 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. పెట్టుబడి పెట్టిన తొలినాళ్లలో లాభాలు రావడంతో బాధితులు చిన్న మొత్తాల నుంచి ఏకంగా లక్షల్లో పెట్టుబడి పెట్టడం ప్రారంభించారు. లాభాలు వస్తాయని విత్ డ్రా చేసుకునే సమయంలో పెట్టుబడి పెట్టిన డబ్బు కూడా లేకుండా పోయింది. దీంతో విషయాన్ని పోలీసులకు చెప్పారు. ప్రస్తుతం ఈ కేసులో పోలీసులు సీరియస్ గా దర్యాప్తు చేస్తున్నారు.
