Rishabh Pant: బంగ్లాదేశ్ ఫీల్డింగ్ సెట్ చేయడానికి కారణం అదే: పంత్

  • పంత్ రెండో ఇన్నింగ్స్‌లో పంత్ సెంచరీ
  • బంగ్లాదేశ్ ఫీల్డ్ సెట్ చేసిన పంత్
  • కారణం ఏంటో చెప్పిన పంత్
Rishabh Pant Ban Fielding

Rishabh Pant Ban Fielding

2022లో కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోలుకున్న వికెట్‌ కీపర్‌ రిషబ్ పంత్.. దాదాపు రేండేళ్ల తర్వాత బంగ్లాదేశ్‌ టెస్ట్ సిరీస్‌లో పునరాగమనం చేసిన విషయం తెలిసిందే. సుదీర్ఘ విరామం తర్వాత టెస్ట్‌ల్లో పునరాగమనం చేసినా.. అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 39 పరుగులు చేసి పర్వాలేదనిపించినా.. రెండో ఇన్నింగ్స్‌లో చెలరేగిపోయాడు. తనదైన శైలిలో బ్యాటింగ్ చేసి.. 13 ఫోర్లు, నాలుగు సిక్స్‌లతో (109) అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. అయితే తన బ్యాటింగ్ సందర్భంగా బంగ్లాదేశ్ టీమ్ ఫీల్డ్ సెట్ చేసిన పంత్ అందరినీ ఆశ్చర్యపరిచాడు.

‘ఇద్దరు ఒకే ప్లేస్‌లో ఫీల్డింగ్ చేస్తున్నారు. మిడ్ వికెట్‌లో ఎవరూ లేరు. ఒకరు అక్కడ ఫీల్డింగ్ చేయండి’ అని బంగ్లాదేశ్‌ ఫీల్డర్లకు రిషబ్ పంత్ సూచించాడు. పంత్ మాటలు విన్న బంగ్లా కెప్టెన్ షాంటో.. ఒక ఫీల్డర్‌ను మిడ్ వికెట్‌లో ఉంచాడు. పంత్ మాట్లాడిన మాటలు స్టంప్ మైక్‌లో రికార్డ్ అవ్వగా.. ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మ్యాచ్ అనంతరం బంగ్లాదేశ్ ఫీల్డింగ్ సెట్ చేయడానికి కారణం ఏంటో పంత్ చెప్పాడు. క్వాలిటీ క్రికెట్ కోసమే తాను ఫీల్డ్ సెట్ చేశానని చెప్పాడు. టీమిండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా మాటలు తనను ప్రభావితం చేశాయని తెలిపాడు.

Also Read: Ashwin-Jadeja: జడేజా అంటే అసూయ.. అశ్విన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!

‘ఆఫ్ ద ఫీల్డ్‌లో నేను అజయ్ జడేజాతో నిత్యం మాట్లాడుతూ ఉంటాను. ఆటలో క్వాలిటీ ఇంకా పెంచాలని నాతో అంటుంటాడు. ఎప్పుడైనా, ఎక్కడైనా క్వాలిటీ క్రికెట్ ఆడాలని చెబుతుంటాడు. బంగ్లాపై నేను బ్యాటింగ్ చేసేటప్పుడు మిడ్ వికెట్‌లో ఎవరూ లేరు. ఒకే ప్లేస్‌లో ఇద్దరు ఫీల్డింగ్ చేస్తున్నారు. అందుకే ఒక ఫీల్డర్‌ను మిడ్ వికెట్‌‌వైపు వెళ్లమని చెప్పా. అజయ్ జడేజా మాటలు నన్ను ప్రభావితం చేశాయి’ అని రిషబ్ పంత్ చెప్పుకొచ్చాడు.