Rinku Singh about Duleep Trophy omission: సెప్టెంబర్ 5 నుంచి దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ 2024 ఆరంభం కానుంది. ఈ టోర్నీలో బరిలోకి దిగే నాలుగు జట్లకు శుభ్మన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్లు కెప్లెన్లుగా ఎంపికయ్యారు. దాదాపుగా అందరు భారత క్రికెటర్స్ దులీప్ ట్రోఫీలో ఆడుతున్నారు. సెంట్రల్ కాంట్రాక్ట్ను కోల్పోయిన వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ కూడా ఆడనున్నాడు. సీనియర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, ఆర్ అశ్విన్లు మొదటి రౌండ్లో ఆడనున్నట్లు తెలుస్తోంది.
దులీప్ ట్రోఫీ 2024కి యువ బ్యాటర్ రింకు సింగ్ను బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. రింకును ఎందుకు తీసుకోలేదని సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. తాజాగా ఈ విషయంపై రింకు స్పందించాడు. గత సీజన్లో గొప్ప ప్రదర్శన చేయకపోవడంతో.. తనకు ఈ సీజన్లో ఆడే అవకాశం రాలేదన్నాడు. స్పోర్ట్స్ టుడేకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రింకు మాట్లాడుతూ… ‘నేను గత దేశవాళీ సీజన్లో బాగా ఆడలేదు. రంజీ ట్రోఫీలో కూడా ఎక్కువ మ్యాచ్లు ఆడలేదు. కేవలం 2-3 మ్యాచ్లు మాత్రమే ఆడా. నేను పెద్దగా రాణించకపోవడంతో ఇప్పుడు ఎంపిక చేయలేదు. అయితే తప్పకుండా దులీప్ ట్రోఫీ రెండో రౌండ్కు ఎంపిక చేస్తారనే నమ్మకంతో ఉన్నా’ అని చెప్పాడు.
Also Read: Kolkata Doctor Rape-Murder: సీఎం మమతా బెనర్జీకి బెదిరింపులు.. విద్యార్థి అరెస్టు!
2023లో ఇండియన్ ప్రీమియర్ లీగ్లో కోల్కతా నైట్ రైడర్స్ తరఫున రింకు సింగ్ అద్భుత ప్రదర్శన చేశాడు. 14 మ్యాచ్ల్లో 474 పరుగులు చేశాడు. ఆ ప్రదర్శనతో 2023 ఆగస్టులో ఐర్లాండ్పై అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. కొద్దికాలంలోనే టీమిండియా టీ20 మిడిల్ ఆర్డర్లో సెటిల్ అయ్యాడు. టీ20 ప్రపంచకప్ 2024లో స్థానం ఖాయం అనుకున్నా.. రిజర్వ్ స్థానంతో సరిపెట్టుకోవలసి వచ్చింది.
