CM Revanth Reddy: శాసనసభలో బీజేపీ సభ్యుల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 22A అంశంపై చర్చిస్తామని ముందే చెప్పామని, సభలో చర్చ జరిగిన తర్వాతే నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బీజేపీ సభ్యులు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు. బీజేపీ తన “చీకటి మిత్రుడిని” కాపాడేందుకు ప్రయత్నిస్తోందని సీఎం ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సభలో విచారణకు ఆదేశించామని తెలిపారు. భూముల వ్యవహారాలు, విద్యుత్ కొనుగోళ్లపై కూడా సభలో చర్చ జరిగిన తర్వాతే విచారణకు ఆదేశాలు ఇచ్చామని చెప్పారు.
“చర్చ లేకుండా ఉరి శిక్ష వేయాలని అనడం సరికాదు” అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీ సభ్యులు చెప్పాలనుకున్న అంశాలపై చర్చించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, ఆ విషయాలను బీఏసీలో ప్రస్తావించాలని సూచించారు. సభలో షార్ట్ డిస్కషన్కు తీసుకుంటామని చెప్పిన తర్వాత కూడా ఆందోళన చేయడం ఎందుకని ప్రశ్నించారు.
సభలో సభ్యులకు ఏదైనా జరిగినప్పుడు వారిని కాపాడాల్సిన బాధ్యత స్పీకర్పై ఉంటుందని సీఎం అన్నారు. అలాంటి స్పీకర్ స్థానానికే అవమానం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్కు జరిగిన అవమానం ఒక్క వ్యక్తికి జరిగినది కాదని, సభలోని సభ్యులందరికీ జరిగిన అవమానమని పేర్కొన్నారు. స్పీకర్ స్థానానికి ఎంతో గౌరవం ఉందని, సభలో సభ్యుల గౌరవంతో పాటు ప్రజల గౌరవాన్ని కూడా కాపాడాల్సిన బాధ్యత ఉందని రేవంత్ రెడ్డి అన్నారు.
“సభాపతిపై సభ్య సమాజం సహించలేని మాటలు మాట్లాడతారా?” అని ప్రశ్నించారు. సమాజం తలవంచుకునేలా మాట్లాడితే అది మొత్తం శాసనసభకే అవమానమని వ్యాఖ్యానించారు. సభా నాయకుడిగా తాను హామీ ఇస్తున్నానని, బీజేపీ సభ్యులు తమ స్థానాల్లో కూర్చోవాలని సీఎం కోరారు. వారు చెప్పాలనుకున్న అంశాలను సభలో చర్చకు తీసుకెళ్లేందుకు అవకాశం ఇస్తామని తెలిపారు. నిన్న ఫామ్హౌస్కు పిలిచి బీజేపీ సభ్యులను రెచ్చగొట్టి పంపించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. సభలో జరిగిన పరిణామాలు సభ్య సమాజం క్షమించరాని నేరమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

