Crime News: నంద్యాలలో దారుణ హత్య జరిగింది. ఒంటరిగా ఉన్న ఓ రిటైర్డు టీచర్ను దోపిడీ దొంగలు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన నంద్యాలలోని హౌసింగ్ బోర్డు కాలనీలో చోటుచేసుకుంది. గ్లాడిస్ అనే రిటైర్డ్ టీచర్ను దోపిడీ దొంగలు పాశవికంగా హత్య చేశారు. కళ్ళలో కారం కొట్టి, గొంతుకోసి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మృతురాలికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వారికి పెళ్లి చేసి ఆమె ఒంటరిగా నివసిస్తోంది. భర్త మోహన్ సుధాకర్ రావు దూరదర్శన్ లో పనిచేస్తూ రిటైర్మెంట్ తరువాత మృతి చెందారు.
Read Also: Coal Mine Accident: బొగ్గు గనిలో పెను ప్రమాదం.. 12 మంది మృతి!
ఇద్దరు కూతుర్లు పెళ్లిళ్లు చేసుకొని హైదరాబాద్లో స్థిరపడడంతో గ్లాడిస్ ఒంటరిగా ఉంటోంది. దుండగులు పక్కాగా రెక్కీ చేసి టీచర్ ఇంటిని టార్గెట్గా చేసుకున్నట్లు తెలిసింది. ఆమె ఒంటరిగా ఉందని తెలుసుకుని ఆమె ఇంటికి దొంగలు వెళ్లారు. వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో టీచర్ కళ్లలో కారం కొట్టి, గొంతుకోసి హత్య చేశారు. స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. క్లూస్ టీం సాయంతో ఆధారాలను సేకరిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ను పోలీసులు పరిశీలిస్తున్నారు. దుండగులు ఎంత సొమ్ము దోచుకెళ్లారనే విషయంపై ఆరా తీస్తున్నారు. భారీగా బంగారం, నగదు అపహరించినట్లు మృతురాలి బంధువులు పోలీసులకు వెల్లడించినట్లు తెలిసింది. మృతురాలి కూతుర్లు, బంధువుల ఫిర్యాదు నేపథ్యంలో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.