Reservation Hatao Andolan: “రిజర్వేషన్లు రద్దు చేయాలి”.. సీజేపీ తరహాలో రిజర్వేషన్లపై మరో ఉద్యమం.. లక్షల్లో ఫాలోవర్స్!

Reservation Hatao Andolan

Reservation Hatao Andolan

Reservation Hatao Andolan (RHA): అభిజీత్ దేప్కే కాక్రోచ్ జనతా పార్టీ (CJP)ని ప్రారంభించాడు. కేవలం రెండు నెలల్లోనే దేశంలోని జెన్-జీ (Gen-Z)ని తన వైపు తిప్పుకున్నాడు. విద్యావ్యవస్థలోని లోపాలపై పోరాడేలా ఏకం చేసి.. ఏకంగా కేంద్ర మంత్రినే గద్దే దింపేస్తాడని తొలుత ఎవ్వరూ ఊహించలేదు. సరైన సమస్యను ఎంచుకుంటే వ్యంగ్యం కూడా ఎంతటి శక్తివంతమైన రాజకీయ ఆయుధంగా మారుతుందో CJP రుజువు చేసింది. ఇప్పుడు అదే బాటలో ఇంటర్నెట్ వేదికగా అనేక అంశాల ఆధారిత డిజిటల్ ఉద్యమాలు పుట్టగొడుగుల్లా వెలుస్తుండటమే కాకుండా, నిమిషాల్లో వేలాదిమంది మద్దతును కూడగట్టుకుంటున్నాయి. వీటిలో కొన్ని సరదాగా ప్రారంభమైన ‘దారు జనతా పార్టీ’, ‘కబూతర్ జనతా పార్టీ’ వంటివి ఉంటే, మరికొన్ని తీవ్రమైన ప్రజా సమస్యలపై పనిచేస్తున్నాయి. అందులో ఇథనాల్ కలిపిన ఈ20 పెట్రోల్ వినియోగంపై వ్యక్తమవుతున్న అసంతృప్తికి గళమెత్తుతున్న ‘E20 జనతా పార్టీ’ ఒకటైతే.. అందరి దృష్టినీ ఆకర్షిస్తూ సోషల్ మీడియాలో విపరీతంగా దూసుకుపోతున్నది మాత్రం ‘రిజర్వేషన్ హఠావో ఆందోళన్’ (RHA).

ఏంటి ఈ ‘రిజర్వేషన్ హఠావో ఆందోళన్’?

పేరుకు తగ్గట్టుగానే కుల ఆధారిత రిజర్వేషన్లను, కుల గణనను రద్దు చేయాలనేది ఈ డిజిటల్ ఉద్యమం ప్రధాన డిమాండ్. గడిచిన వారం రోజులుగా విద్యార్థుల నిరసనలతో దేశం అట్టుడికిపోతున్న వేళ, ఈ ఖాతా నెమ్మదిగా సైలెంట్‌గా విస్తరించింది. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో దీనికి ఏకంగా 58 లక్షలకు (5.8 మిలియన్లు) పైగా ఫాలోవర్లు ఉన్నారు. తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ వంటి ప్రధాన రాజకీయ పార్టీల ఫాలోవర్ల కంటే ఇది చాలా ఎక్కువ. కులాతీత సమాజాన్ని, ప్రతిభ ఆధారిత అవకాశాలను ఆశిస్తూ ఈ ఖాతా ముందుకు సాగుతోంది. దాదాపు 120కి పైగా పోస్టులు ఉన్న ఈ ఇన్‌స్టాగ్రామ్ పేజీ, కేవలం ఒకే ఒక్క ఖాతాను ‘ఇండియన్ ఆర్మీ’ని మాత్రమే ఫాలో అవుతుండటం గమనార్హం.

“రిజర్వేషన్ రాజకీయంలో నష్టపోయిన పౌరుల మద్దతుతో.. ప్రతిభే ప్రామాణికంగా నడిచే ఉద్యమం” అని దీని బయోలో రాసుకొచ్చారు. అంతేకాకుండా ప్రముఖ కవి దినకర్ రాసిన కవితా పంక్తులను కూడా ఇందులో పేర్కొన్నారు. “సద్గుణాలు, స్వయం క్రమశిక్షణ ద్వారానే గౌరవం లభిస్తుంది. కేవలం పిరికివారు, క్రూరులు మాత్రమే నిరంతరం కులం గురించి మాట్లాడతారు.” అనే కొటేషన్ రాసుకొచ్చారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. కుల రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నప్పటికీ, ఈ ఉద్యమం డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఇచ్చిన ప్రసిద్ధ పిలుపు “బోధించు, సమీకరించు, పోరాడు” అనే సూత్రాన్ని వాడుకుంటోంది. వీరి లోగోపై “సమానత్వం, ప్రతిభ, న్యాయం” అనే నినాదం కనిపిస్తుంది. 1942లో నాగ్‌పూర్‌లో జరిగిన సమావేశంలో కుల వివక్షను అణచివేయడానికి అంబేడ్కర్ ఈ పిలుపునిచ్చారు.

రాజకీయాలకు అతీతం!

అయితే ఈ ‘రిజర్వేషన్ హఠావో ఆందోళన్’ వెనుక ఎవరున్నారనేది ఇప్పటికీ గోప్యంగానే ఉంది. తమకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని ఇది ప్రకటించుకుంది. “ప్రభుత్వం మారితే రిజర్వేషన్ వ్యవస్థలో మార్పులు వస్తాయని ఒకప్పుడు భావించాం, కానీ బీజేపీ కూడా విఫలమైంది” అని ఒక పోస్టులో పేర్కొన్నారు. అలాగే, రిజర్వేషన్లు పూర్తిగా తొలగించమని వీళ్లు కోరుకోవడం లేదు. కానీ.. దివ్యాంగులు, అనాథ పిల్లలు, దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల పిల్లలు, మతం, కులంతో సంబంధం లేకుండా ఆర్థికంగా వెనుకబడిన పేదలకు మాత్రమే రిజర్వేషన్లు పరిమితం కావాలని ప్రతిపాదిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో రిజర్వేషన్లు 50 శాతం పరిమితిలో ఉండగా, దాన్ని పెంచాలని కొన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్న తరుణంలో ఈ డిజిటల్ మూవ్‌మెంట్ తెరపైకి వచ్చింది. గుర్తింపు అనేది కులం ఆధారంగా ఉండకూడదని, ప్రభుత్వ దరఖాస్తులు లేదా ఉద్యోగ, విద్యా సంబంధిత ఫారమ్‌లలో కులాన్ని ప్రకటించే విధానాన్ని పూర్తిగా ఎత్తివేయాలని వీరు కోరుతున్నారు. వీరందిరి అంతిమ లక్ష్యం “ఒకే దేశం.. ఒకే గుర్తింపు”. సమాజంలో ఉన్న అసంతృప్తిని సరైన సమయంలో ప్రశ్నించడం వల్లే కాక్రోచ్ జనతా పార్టీ అంతటి ప్రజాదరణ పొందింది. మరి ఇప్పుడు పుట్టుకొచ్చిన ఈ డిజిటల్ ప్రచారాలు, ‘రిజర్వేషన్ హఠావో ఆందోళన్’ వంటి ఉద్యమాలు వ్యవస్థలో మార్పులు తీసుకురాగలవా లేదా సోషల్ మీడియాకే పరిమితమైపోతాయా అనేది కాలమే నిర్ణయించాలి!