Renu Desai: సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్న వారిపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా సినీ నటి రేణు దేశాయ్ దాఖలు చేసిన ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు, ఆమెను వేధించిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో తనపై వస్తున్న అసభ్యకర కామెంట్లు, వ్యక్తిగత దూషణలపై రేణు దేశాయ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తూ, అశ్లీల పదజాలంతో వేధిస్తున్న మొత్తం నాలుగు సోషల్ మీడియా అకౌంట్లపై ఆమె సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును సీరియస్గా తీసుకున్న పోలీసులు.. సాంకేతిక ఆధారాల సాయంతో నిందితులను గుర్తించి, ఇద్దరిని కటకటాల వెనక్కి నెట్టారు. మిగిలిన ఇద్దరి కోసం కూడా గాలింపు వేగవంతం చేశారు.
కేటుగాళ్లకు పోలీసుల హెచ్చరిక..
చీకట్లో ఉండి ఫేక్ అకౌంట్లతో కామెంట్లు చేస్తే ఎవరూ పట్టుకోలేరనే ధైర్యంతో ఉన్న కేటుగాళ్ల ఆటకట్టిస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. “మీరు ఎక్కడ ఉన్నా, ఎంతటి రహస్యంగా వ్యవహరించినా సాంకేతిక పరిజ్ఞానంతో మిమ్మల్ని పట్టుకుంటాం” అని పోలీసులు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే నటి అనసూయను సోషల్ మీడియాలో వేధించిన కేసులో కూడా ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వరుసగా జరుగుతున్న ఈ అరెస్టులు సోషల్ మీడియా వేధింపులకు పాల్పడే వారిలో వణుకు పుట్టిస్తున్నాయి. సెలబ్రిటీలే కాకుండా సామాన్య మహిళలు కూడా ఇలాంటి వేధింపులకు గురైతే వెంటనే పోలీసులను ఆశ్రయించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ పోలీసులు భరోసా ఇచ్చారు.
READ ALSO: MP Raghav Chadha: పార్లమెంట్లో రూ.19 వేల కోట్ల బ్యాంకుల గుట్టు విప్పిన ఎంపీ రాఘవ్ చద్ధా!
