RCB vs SRH: లక్నో వేదికగా జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన బెంగళూరు జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దానితో బ్యాటింగ్ కు వచ్చిన సన్రైజర్స్ హైదరాబాదు (SRH) జట్టు బ్యాటింగ్లో అదరగొట్టింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) బౌలర్లపై సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు విరుచుకుపడి నిర్ణీత 20 ఓవర్లలో 231 పరుగులు చేసి ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. హైదరాబాదు జట్టు తొలి వికెట్ 54 పరుగుల వద్ద కోల్పోయినా, ఆరంభం దుమ్ముదులిపేలా సాగింది. అభిషేక్ శర్మ 17 బంతుల్లో 34 పరుగులు (3 ఫోర్లు, 3 సిక్సులు) చేసి ఆకట్టుకోగా, ట్రావిస్ హెడ్ 10 బంతుల్లో 17 పరుగులు చేశాడు.
ఇక ఆ తర్వాత వచ్చిన వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ 48 బంతుల్లో 94 పరుగులు* (7 ఫోర్లు, 5 సిక్సులు) తో అదరగొట్టాడు. చివరి వరకు ఆడుతూ స్కోరు బోర్డుపై పరుగుల వర్షం కురిపించాడు. ఇక మిడిల్ ఆర్డర్ లో హెన్రిచ్ క్లాసెన్ (13 బంతుల్లో 24), అనికేత్ వర్మ (9 బంతుల్లో 26) కూడా వేగంగా ఆడారు. ఇన్నింగ్స్ చివర్లో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 6 బంతుల్లో 13 పరుగులు చేసి స్కోరు పెరిగేందుకు తోడ్పడ్డారు. మొత్తంగా SRH జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 231 పరుగుల భారీ స్కోర్ చేసింది. చివరి 5 ఓవర్లలో SRH 63 పరుగులు సాధించింది.
RCB బౌలింగ్ విభాగంలో రోమారియో షెపర్డ్ 2 ఓవర్లలో 14 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకోగా.. భువనేశ్వర్ కుమార్, లుంగి ఎంగిడి, సుయాష్ శర్మ, కృనాల్ పాండ్యా చెరో వికెట్ తీసినా భారీగా పరుగులు సమర్పించుకున్నారు.