ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్కు ముందే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫ్రాంచైజీని విక్రయించే అవకాశం ఉంది. ఆర్సీబీ ఫ్రాంచైజీ విక్రయ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఐపీఎల్ 2026కి ముందే ఫ్రాంచైజీని విక్రయించే అవకాశం ఉందని డియాజియో పీఎల్సీకి చెందిన భారత అనుబంధ సంస్థ యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ (యూఎస్ఎల్) బుధవారం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ)కి ఓ లేఖ రాసింది. ఫ్రాంచైజీలో పెట్టుబడి పెట్టే వారి కోసం చూస్తున్నట్లు లేఖలో పేర్కొంది. 2026 మార్చి 31 వరకు ఈ ప్రక్రియ పూర్తికానున్నట్లు యూఎస్ఎల్ తెలిపింది.
కంపెనీ అనుబంధ సంస్థ రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఆర్ఎస్పీఎల్)లో పెట్టుబడిపై సమీక్ష ప్రారంభిస్తున్నట్లు యూఎస్ఎల్ లేఖలో పేర్కొంది. అమ్మకానికి ఆర్సీబీ పురుషులు, మహిళల జట్లు ఉన్నాయి. రెండు టీమ్స్ అమ్మకం ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి పూర్తిచేయాలని కంపెనీ ఆశిస్తోంది. యూఎస్ఎల్ సీఈవో, ఎండీ ప్రవీణ్ సోమేశ్వర్ మాట్లాడుతూ.. యూఎస్ఎల్కు ఆర్ఎస్పీఎల్ విలువైన, వ్యూహాత్మక ఆస్తి అని పేర్కొన్నారు. అయితే తమ ఆల్కబెవ్ వ్యాపారానికి ఇది ప్రధానం కాదన్నారు. ఐపీఎల్ జట్టును డియాజియో కంపెనీ సొంతం చేసుకోవడం పట్ల చాలా మంది వాటాదారులు అసంతృప్తిగా ఉన్నారని నివేదికలు ఉన్నాయి. మొత్తానికి ఆర్సీబీ త్వరలోనే చేతులు మారనుంది.
వ్యాక్సిన్ తయారీదారు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇటీవల దాదాపు రూ.17,000 కోట్లకు ఆర్సీబీని కొనుగోలు చేస్తోందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అదార్ పూనవల్లా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ Xలో పోస్ట్ చేయడమే ఇందుకు కారణం. ఇక ఆర్సీబీ ప్రాంచైజీని కొనుగోలు చేయడనికి బడా వ్యాపారవేత్తలు పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. జెఎస్డబ్ల్యు గ్రూప్కు చెందిన పార్థ్ జిందాల్ సహా ఉన్నత స్థాయి వ్యక్తులు డియాజియో మేనేజ్మెంట్తో చర్చలు జరిపినట్లు సమాచారం. అదానీ గ్రూప్, ఒక ప్రముఖ ఢిల్లీ వ్యాపారవేత్త కూడా ఆర్సీబీ జట్టు కొనుగోలుపై ఆసక్తిగా ఉన్నారట. రెండు యూఎస్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు కూడా రేసులో ఉన్నాయట. అదార్ పూనవల్లా బాగా ట్రై చేస్తున్నట్లు సమాచారం. 2010లో లీగ్ విస్తరణ సమయంలో ఆదర్ తండ్రి సైరస్ పూనావాలా ఫ్రాంచైజీ కోసం బిడ్ వేశారు. అయితే సహారా, రెండెజౌస్ స్పోర్ట్స్లు రెండు టీమ్స్ కొనుగోలు చేశాయి.
గతంలో ఆర్సీబీ ప్రాంచైజీ మద్యం వ్యాపారి విజయ్ మాల్యా సొంతం. 2016లో మాల్యా తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో పడినప్పుడు డియాజియో కంపెనీ అతని (మాల్యా) మద్యం కంపెనీతో పాటుఆర్సీబీని కూడా కొనుగోలు చేసింది. 2008లో మాల్యా RCBని $111.6 మిలియన్లకు (రూ.76 కోట్లు) కొనుగోలు చేశాడు. 2014లో డియాజియో యూఎస్ఎల్లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. 2016 నాటికి మాల్యా నిష్క్రమణ తర్వాత డియాజియో ఆర్సీబీని పూర్తిగా సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆర్సీబీని యూఎస్ఎల్ అనుబంధ సంస్థ రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తోంది. ఐపీఎల్ 2025 విజేత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచిన విషయం తెలిసిందే.