Ravindra Jadeja: మైండ్ బ్లోయింగ్ రికార్డ్.. అనిల్ కుంబ్లే తర్వాత ఆ మైలురాయి దాటిన ‘స్టార్ ఆల్‌రౌండర్’..

Jadeja

Jadeja

భారత క్రికెట్ చరిత్రలోనే అరుదైన మైలురాయిని చేరుకుంటూ స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా టెస్టు క్రికెట్‌లో 350 వికెట్ల ఘనత సాధించాడు. తన అద్భుతమైన స్పిన్ బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను తికమక పెడుతూ టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న జడేజా, ఈ ప్రత్యేకమైన క్లబ్‌లో చేరిన ఐదో భారత బౌలర్‌గా నిలిచాడు.

భారత్ తరఫున టెస్టుల్లో 350 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అనిల్ కుంబ్లే, రవిచంద్రన్ అశ్విన్, కపిల్ దేవ్, హర్భజన్ సింగ్ ల సరసన ఇప్పుడు రవీంద్ర జడేజా చేరాడు. కేవలం బౌలింగ్‌లోనే కాకుండా లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌తో సుదీర్ఘ కాలంగా జట్టుకు వెన్నుముకగా నిలుస్తున్నాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 3,000 పరుగులు చేయడంతో పాటు 350 వికెట్లు పడగొట్టిన అరుదైన ఆల్‌రౌండర్లలో ఒకడిగా నిలిచి ప్రపంచ క్రికెట్‌లో తన ముద్రను మరింత బలంగా వేసాడు.

జడేజా సాధించిన ఈ ఘనతపై క్రికెట్ ప్రపంచం ప్రశంసలు కురిపిస్తోంది. సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ వంటి మాజీ దిగ్గజాలు, ఇతర క్రికెట్ ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా ఆయనకు అభినందనలు తెలిపారు. ‘సర్ జడేజా’గా అభిమానులు పిలుచుకునే ఆయన ఆల్‌రౌండ్ నైపుణ్యాలు భారత జట్టుకు ఎంతో బలమని, భవిష్యత్తులో మరిన్ని రికార్డులు తిరగరాయాలని ఆకాంక్షిస్తున్నారు.