NTV Telugu Site icon

WI vs IND: అశ్విన్ స్పిన్‌ మాయాజాలం.. తొలి టెస్టులో భారత్‌కు ఇన్నింగ్స్‌ విజయం!

Ashwin

Ashwin

IND vs WI 1st Test Highlights: డొమినికా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్‌ ఇన్నింగ్స్‌ విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో విండీస్ 130 పరుగులకే ఆలౌట్ అవ్వడంతో రోహిత్ సేన ఇన్నింగ్స్‌ 141 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియా సీనియర్ స్పిన్నర్ ఆర్ అశ్విన్ (7/71) మరోసారి తన స్పిన్‌ మాయాజాలం చూపించాడు. అరంగేట్రంలోనే సెంచరీతో ఆకట్టుకున్న యశస్వి జైస్వాల్ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు. ఈ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ 2023-25 సైకిల్‌లో భారత్‌కు అదిరే ఆరంభం దక్కింది.

మూడో రోజైన శుక్రవారం 312/2 ఓవర్‌ నైట్‌ స్కోరుతో ఆటను ప్రారంభించిన భారత్.. 421/5 వద్ద డిక్లేర్‌ చేసింది. దాంతో తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ సేనకు 271 పరుగుల ఆధిక్యం దక్కింది. అనంతరం కరీబియన్‌ జట్టు రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసి విండీస్‌ను దెబ్బకొట్టిన అశ్విన్‌.. రెండో ఇన్నింగ్స్‌లోనూ చెలరేగాడు. త్యాగ్‌నారాయణ్‌ చందర్‌పాల్ (7)ను జడేజా ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపడంతో విండీస్ పతనం మొదలైంది. కొద్దిసేపటికే క్రెయిగ్ బ్రాత్‌వైట్ (7) అశ్విన్‌ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. టీ విరామ సమయానికి విండీస్ 27/2తో నిలిచింది.

Also Read: Today Gold Price: స్థిరంగా బంగారం ధరలు.. భారీగా పెరిగిన వెండి!

మూడో సెషన్‌ ఆరంభంలోనే జర్మన్ బ్లాక్‌వుడ్ (5)ను అశ్విన్‌ ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. కాసేపటికే రీఫర్‌ (11)ను జడేజా పెవిలియన్‌కు పంపాడు. మొహ్మద్ సిరాజ్‌ బౌలింగ్‌లో దసిల్వా (13) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. వరుస వికెట్స్ పడడంతో విండీస్‌ను ఆదుకునే ప్రయత్నం చేసిన అథనేజ్‌ (28) యాష్ బౌలింగ్‌లో యశస్వికి చిక్కాడు. అశ్విన్ బౌలింగ్‌లో అల్జారీ జోసెఫ్‌ (13) గిల్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. విండీస్ బాహుబలి రఖీమ్‌ కార్న్‌వాల్‌ (4), కీమర్‌ రోచ్‌ (0)లను ఒకే ఓవర్‌లో అశ్విన్ ఔట్ చేశాడు.

కీమర్‌ రోచ్‌ ఔట్ కాగానే మూడో రోజు నిర్ణీత ఓవర్లు ముగిశాయి. అయితే ఆలౌట్‌కు విండీస్‌ కేవలం ఒక వికెట్ దూరంలోనే ఉండటంతో.. అంపైర్లు మ్యాచ్‌ను అరగంట సేపు పొడగించారు. ఇన్నింగ్స్ చివరలో మూడు ఫోర్లు బాదిన జోమెల్ వారికన్ (18) అశ్విన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగడంతో విండీస్‌ ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో చివరి ఐదు వికెట్లు అశ్విన్‌ పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో విండీస్‌ 150 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 421/5 వద్ద డిక్లేర్‌ చేసింది. యశస్వి జైస్వాల్‌ (171; 387 బంతుల్లో 16×4, 1×6), రోహిత్ శర్మ (103; 221 బంతుల్లో 10×4, 2×6) సెంచరీలు చేయగా.. విరాట్ కోహ్లీ (76; 182 బంతుల్లో 5×4) అర్ధ శతకం బాదాడు. ఇక రెండో టెస్టు జులై 20న ఆరంభం కానుంది.

Also Read: TTD: ముగుస్తున్న టీటీడీ పాలక మండలి గడువు.. ఆ రెండు ఆప్షన్లపై ఉత్కంఠ..