Jharkhand: హేమంత్ సోరెన్‌కు కోర్టులో ఊరట.. బలపరీక్షకు వచ్చేస్తున్నారు

Jh Ex Cm

Jh Ex Cm

ఝార్ఖండ్ (Jharkhand) మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు (Hemant Soren) కోర్టులో ఊరట లభించింది. సోమవారం అసెంబ్లీలో జరగనున్న బలపరీక్షకు హాజరయ్యేందుకు రాంచీ ప్రత్యేక కోర్టు హేమంత్‌కు అనుమతి ఇచ్చింది. దీంతో ఆయన శాసనసభలో జరిగే బలపరీక్షకు హాజరుకానున్నారు.

శుక్రవారం చంపయ్ సోరెన్ (Champai Soren) ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ రాధాకృష్ణన్.. చంపయ్‌తో ప్రమాణం చేయించారు. అనంతరం అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని 10 రోజులు చంపయ్‌కు గవర్నర్ గడువు ఇచ్చారు. కానీ అంతకంటే ముందుగానే ఈ కార్యక్రమం ముగించేయాలని చంపయ్ సోరెన్ సిద్ధపడ్డారు. సోమవారం నుంచి రెండ్రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. దీంతో ఫిబ్రవరి 5నే (సోమవారం) అసెంబ్లీలో బలపరీక్షకు సంకీర్ణ ప్రభుత్వం సిద్ధపడింది.

ఇదిలా ఉంటే జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలను ఇప్పటికే హైదరాబాద్‌కు (Hyderabad) తరలించారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు హైదరాబాద్‌లో ఉంచితేనే సేఫ్ అని భావించడంతో భాగ్యనగరానికి తరలించారు. సోమవారం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి ఝార్ఖండ్ ఎమ్మెల్యేలను తరలించనున్నారు. కూటమికి మొత్తం 48 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మనీలాండరింగ్ కేసులో ప్రస్తుతం జైల్లో ఉన్నారు. బలపరీక్షలో ఓటు వేసేందుకు కోర్టు అనుమతి కోరగా.. తాజాగా న్యాయస్థానం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

ఇది కూడా చదవండి:Punjab: పంజాబ్ గవర్నర్ షాకింగ్ నిర్ణయం