Site icon NTV Telugu

RajPal Yadav : తిహార్ జైలుకు స్టార్ కమెడియన్

Rajpal Yadav

Rajpal Yadav

బాలీవుడ్‌లో తిరుగులేని కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న రాజ్‌పాల్ యాదవ్‌కు న్యాయస్థానంలో భారీ షాక్ తగిలింది. 2010లో ఆయన దర్శకత్వం వహించిన ‘అతా పతా లాపతా’ సినిమా ఆయనను ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తీసింది. ఈ సినిమా కోసం ఆయన చేసిన అప్పులే ఇప్పుడు ఆయన్ని కటకటాల వెనక్కి నెట్టాయి. సినిమా నిర్మాణం కోసం రాజ్‌పాల్ యాదవ్ ఢిల్లీకి చెందిన ‘మురళీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే సంస్థ నుండి రూ. 5 కోట్ల రుణం తీసుకున్నారు. అయితే, సినిమా ఆశించిన విజయం సాధించకపోవడంతో ఆ అప్పు తీర్చడం ఆయనకు భారంగా మారింది.

Also Read : Balayya : డాన్ గా బాలయ్య.. సోలో రిలీజ్ కోసం ప్లానింగ్

ఈ క్రమంలో ఆయన ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడంతో సదరు సంస్థ కోర్టును ఆశ్రయించింది. వడ్డీలు, జరిమానాలతో కలిసి ఆ మొత్తం ఇప్పుడు రూ. 9 కోట్లకు చేరింది. చెక్ బౌన్స్ కేసులో 2018లోనే ఆయనకు 6 నెలల జైలు శిక్ష పడగా, అప్పటి నుండి ఆయన పైకోర్టుల్లో స్టే పొందుతూ వచ్చారు. అయితే, బాకీ చెల్లిస్తానని కోర్టుకు ఇచ్చిన హామీలను వరుసగా ఉల్లంఘించడంతో న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. ఫిబ్రవరి 4, 2026 నాటికి లొంగిపోవాలని కోర్టు ఆదేశించగా, మరికొంత సమయం కావాలని ఆయన చేసిన విన్నపాన్ని జస్టిస్ స్వర్ణ కాంత శర్మ తిరస్కరించారు. “చట్టం ముందు అందరూ సమానమే, సెలబ్రిటీల కోసం ప్రత్యేక నిబంధనలు సృష్టించలేం” అని కోర్టు స్పష్టం చేయడంతో ఆయన ఫిబ్రవరి 5న తిహార్ జైలు అధికారుల ముందు లొంగిపోయారు. జైలుకు వెళ్లే ముందు రాజ్‌పాల్ యాదవ్ అత్యంత భావోద్వేగానికి లోనయ్యారు. “సార్, నేను ఏం చేయాలి? నా దగ్గర పైసలు లేవు.. మరో దారి కనిపించడం లేదు. ఇక్కడ మేమంతా ఒంటరి వాళ్ళమే, ఎవరూ స్నేహితులు ఉండరు. ఈ సంక్షోభాన్ని నేను ఒక్కడినే ఎదుర్కోవాలి” అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. తెలుగులో రవితేజ నటించిన కిక్ 2 వంటి సినిమాలతో ఇక్కడి ప్రేక్షకులకు కూడా సుపరిచితుడైన రాజ్‌పాల్, ఇలాంటి పరిస్థితిలో ఉండటం అందరినీ కలిచివేస్తోంది.

Exit mobile version