రాజమహేంద్రవరంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత పిఠాపురానికి చెందిన పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ఏఈ నూకరాజు కుటుంబ సభ్యులతో కలిసి రాజమహేంద్రవరం రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకారు. ఈ ఘటనలో నూకరాజు (60), ఆయన భార్య మీనా (58), కుమార్తె సౌజన్య (34) గల్లంతయ్యారు. నూకరాజు మనవడిని మత్స్యకారులు గుర్తించి రక్షించారు. ప్రస్తుతం బాలుడు సురక్షితంగా ఉన్నాడు.
ఘటనపై సమాచారం అందుకున్న రాజమహేంద్రవరం టూ టౌన్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్లు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి గోదావరిలో గల్లంతైన ముగ్గురి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. వారి ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈత రావడంతో ఏఈ మనవడు ప్రాణాలతో బయటపడ్డాడు. అదే సమయంలో మత్స్యకారులు అతడికి ఒడ్డుకు చేర్చారు. బాలుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
షేక్ షాదీ ఖాన్ వేధింపులు, మోసాల కారణంగానే తాము ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు నూకరాజు తన సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. తన కుమార్తెకు సహాయంగా ఉంటానని నమ్మించి షేక్ షాదీ ఖాన్ మోసం చేశాడని ఆరోపించారు. తన మనవడు కార్తీక్ రెడ్డికి రైఫిల్ షూటింగ్లో శిక్షణ ఇప్పిస్తూ.. కుమార్తెకు సహాయం చేస్తానని నమ్మించాడని లేఖలో పేర్కొన్నారు. అలాగే కుటుంబ సభ్యులకు సంబంధించిన డబ్బులు, విలువైన వస్తువులు, బ్యాంకు ఖాతాలు షేక్ షాదీ ఖాన్ ఆధీనంలోకి వెళ్లాయని నూకరాజు తెలిపారు. తన కుమార్తె సౌజన్య భర్త ఈ ఏడాది జూలై 2న మృతి చెందిన విషయాన్ని కూడా లేఖలో ప్రస్తావించారు.
షేక్ షాదీ ఖాన్పై కఠిన చర్యలు తీసుకోవాలని, తమ కుటుంబం ఎదుర్కొన్న ఇబ్బందులపై విచారణ జరిపించాలని జిల్లా కలెక్టర్ను నూకరాజు కోరారు. ప్రస్తుతం గోదావరిలో గల్లంతైన నూకరాజు, మీనా, సౌజన్య కోసం పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, గజ ఈతగాళ్ల బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. ఘటనకు అసలు కారణాలు ఏమిటి, సూసైడ్ నోట్లో పేర్కొన్న ఆరోపణల్లో ఎంతవరకు వాస్తవం ఉంది అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

