తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత గత ఐదు రోజులుగా నెలకొన్న రాజకీయ అనిశ్చితి ఎట్టకేలకు తొలగిపోయింది. సీపీఐ, సీపీఎం, వీసీకే, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) పార్టీలు మద్దతు తెల్పడంతో విజయ్ బలం 120కి చేరింది. అయితే విజయ్ రెండు చోట్ల పోటీ చేయడంతో ఒక సీటు మినహాయించాల్సి వచ్చింది. లేదంటే విజయ్ బలం 121 ఉండేది. శుక్రవారం సాయంత్రం గవర్నర్ అర్లేకర్ను విజయ్ కలిసి మద్దతు లేఖను అందజేశారు. దీంతో సంతృప్తి చెందిన గవర్నర్.. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు.
ఇక రేపు ఉదయం 11 గంటలకు చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకోసం చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. విజయ్తో పాటు దాదాపు 20 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. వీసీకే నుంచి ఒకరు, కాంగ్రెస్ నుంచి ఇద్దరికి అవకాశం దక్కే అవకాశం ఉంది. ఇక విజయ్ ప్రమాణస్వీకారానికి కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ హాజరయ్యే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.
ఇక పెద్ద ఎత్తున అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు విజయ్ ప్రమాణస్వీకారానికి రావొచ్చని పోలీసులు అంచనాలు వేస్తున్నారు. దీంతో పెద్ద ఎత్తున అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
