Rahul Gandhi: సీజేపీ నిరసనలపై స్పందించిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. ఏమన్నారంటే?

Rahulgandhi

Rahulgandhi

Rahul Gandhi: ఢిల్లీలో జరిగిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) నిరసనలపై పోలీసుల లాఠీఛార్జ్‌ను కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ వెంటనే దేశ ప్రజలకు, విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హక్కుల కోసం పోరాడుతున్న విద్యార్థులపై లాఠీలు ఝళిపించడం ఎంతమాత్రం సరైంది కాదని, ఇది పూర్తిగా ‘భారతీయ సంస్కృతికి వ్యతిరేకం’ అని మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్న ఈ అంశంపై ప్రధాని మోదీ ఇప్పటివరకు నోరు విప్పకపోవడం దారుణమని నిలదీశారు.

ఈ ఘటనపై పార్లమెంట్‌లో చర్చ జరపాలంటూ ఇతర ప్రతిపక్ష ఎంపీలతో కలిసి రాహుల్ గాంధీ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. అయితే సభలో చర్చ చేపట్టాలంటే ముందుగా కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలని స్పీకర్ తమతో అన్నారని రాహుల్ వెల్లడించారు. ప్రజాసమస్యలపై పార్లమెంట్‌లో చర్చించడానికి కూడా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి రావడం విచారకరమని ఆయన విమర్శించారు. దేశంలో విద్యా, పరీక్షల వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయిందని, లీకేజీలతో వ్యవస్థ లోపలి నుంచి గుల్లయిందని ఆరోపించారు. సమస్యలను పరిష్కరించి విద్యావ్యవస్థను ప్రక్షాళన చేయాల్సింది పోయి, విద్యార్థులపై లాఠీఛార్జ్ చేయించడం ఏంటని ప్రశ్నించారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, హోంమంత్రి అమిత్ షాలు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు. అలాగే హోంమంత్రికి నాయకత్వం వహిస్తున్న ప్రధాని మోదీ కూడా ఈ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని ఆయన స్పష్టం చేశారు.