Puri Jagannath Ratna Bhanda: ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘రత్న భండార్’ (ఆభరణాల గది) రహస్యం త్వరలోనే వీడనుంది. సుమారు 48 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, రత్న భండారంలోని అమూల్యమైన బంగారం, వెండి, వజ్ర వైఢూర్యాల లెక్కింపు ప్రక్రియ బుధవారం అధికారికంగా ప్రారంభమైంది. బుధవారం మధ్యాహ్నం 12:09 గంటల నుంచి 1:40 గంటల మధ్య ఉన్న అత్యంత శుభ ముహూర్తంలో ఈ ప్రక్రియను చేపట్టారు. ఆలయ సంప్రదాయాలను పాటిస్తూ, అధికారులు, నియమించబడిన సిబ్బంది సమక్షంలో ఆభరణాల జాబితాను సిద్ధం చేసే పని మొదలైంది. అంతకుముందు 11:30 గంటల ప్రాంతంలోనే సిబ్బంది సాంప్రదాయక దుస్తులైన ధోవతి, ఉత్తరీయం ధరించి ఆలయంలోకి ప్రవేశించారు.
READ ALSO: Jr NTR : ఎన్టీఆర్ గ్రాండ్ పార్టీ.. డ్రాగన్కు స్పెషల్ ట్రీట్!
48 ఏళ్ల తర్వాత రత్న గర్భం వెలుగులోకి..
చివరిసారిగా 1978లో ఈ రత్న భండారంలోని ఆభరణాల లెక్కింపు జరిగింది. ఆ సమయంలో రికార్డుల ప్రకారం.. 128 కిలోల బంగారు ఆభరణాలు, 221 కిలోల వెండి ఆభరణాలు ఉన్నాయి. ఇప్పుడు దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత మళ్లీ లెక్కింపు జరుగుతుండటంతో, ప్రస్తుతం అక్కడ ఎంత సంపద ఉందనేది యావత్ దేశ వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. శ్రీ జగన్నాథ ఆలయ పరిపాలన విభాగం (SJTA) ఈ ప్రక్రియను అత్యంత గోప్యంగా, భద్రత నడుమ నిర్వహిస్తోంది. కేవలం ప్రభుత్వం గుర్తించిన, లెక్కింపు కోసం నియమించిన వ్యక్తులకు మాత్రమే లోపలికి అనుమతి కల్పించారు. లోపలికి వెళ్లే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆలయ నిబంధనల ప్రకారం సాంప్రదాయక దుస్తుల్లోనే వెళ్లాలి. పూరీ జగన్నాథుడి రత్న భండారంలో ఉండే అంతుచిక్కని నిధుల గురించి తరతరాలుగా అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. ఇప్పుడు జరుగుతున్న ఈ అధికారిక లెక్కింపు ద్వారా ఆ నిధుల అసలు విలువ, వివరాలు బయటకు రానున్న నేపథ్యంలో భక్తుల్లో ఆసక్తి నెలకొంది.
